కృష్ణంరాజుకు ప్రకృతి అంటే చాలా ఇష్టం

కృష్ణంరాజుకు ప్రకృతి అంటే చాలా ఇష్టం

రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసానికి చేరుకొని, కృష్ణంరాజు పార్థివదేహానికి నివాళులర్పిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ పెద్దలు ఆయన్ను సందర్శించి కృష్ణంరాజు కుటుంబసభ్యులను ఓదారుస్తున్నారు. అయితే తాజాగా సినీ నటి రోజా కృష్ణంరాజు మృతదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సినిమా పరిశ్రమలో, రాజకీయ రంగంలో నిజంగా కృష్ణంరాజు రారాజేనని సినీ నటి, ఏపీ మంత్రి రోజా అన్నారు. తాను కృష్ణం రాజుతో కలిసి చేసిన సినిమా ఒకటే అయినా ఆయన చూపించే ఆప్యాయత మాటల్లో చెప్పలేనని చెప్పారు. తాను రాజకీయాల్లోకి వస్తున్న సమయంలో నూ కృష్ణంరాజు తనకు సపోర్ట్ చేశారని తెలిపారు. కృష్ణంరాజు కు ప్రకృతి అంటే చాలా ఇష్టంమన్న రోజా... ఆయుర్వేదం గురించి ఆయన అందరికి చెప్పేవాడన్నారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. కృష్ణంరాజు సతీమణి చూస్తే చాలా భాదేసిందన్న రోజా... వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు స్పష్టం చేశారు.

కృష్ణం రాజు మరణంతో టాలీవుడ్ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణం రాజు.. నిన్న తెల్లవారుజామున చికిత్స పొందుతూ కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. కృష్ణంరాజు మరణవార్తతో ఆయన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అభిమానులంతా కృష్ణంరాజు మరణంతో శోకసంద్రంలో మునిగిపోయారు.