
కెరీర్ స్టార్ట్ చేసింది టాలీవుడ్లోనే అయినా వరుస బాలీవుడ్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా దూసుకెళుతోంది కృతి సనన్. ‘ఆది పురుష్’లో సీత పాత్రలో నటిస్తోన్న కృతి, మరోవైపు ‘అల వైకుంఠపురంలో’ హిందీ రీమేక్లోనూ కనిపించబోతోంది. ఇలా వరుస సినిమాల్లో నటిస్తోన్న కృతి, తాజాగా మరో క్రేజీ మూవీకి సైన్ చేసింది. ‘ద క్రూ’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో టబు, కరీనాకపూర్ లాంటి సీనియర్స్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. ‘లూట్కేస్’ ఫేమ్ రాజేష్ కృష్ణన్ దర్శకత్వం వహించబోతున్నాడు.
‘వీరే ది వెడ్డింగ్’ తర్వాత ఏక్తాకపూర్, రియా కపూర్ కలిసి నిర్మిస్తున్న చిత్రమిది. ఇటీవల ఈ సినిమాను అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఎయిర్లైన్ ఇండస్ట్రీ బ్యాక్డ్రాప్లో కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నారు. ఎయిర్లైన్స్లో పనిచేసే ముగ్గురు అమ్మాయిలు అనుకోకుండా ఓ సమస్యలో ఇరుక్కుంటారు. దాని నుండి వాళ్లు ఎలా బయటపడ్డారనేదే కాన్సెప్ట్. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టు చెప్పారు.
‘ఈ సినిమాలో భాగమైనందుకు చాలా థ్రిల్ ఫీలవుతున్నా. టబు, కరీనా లాంటి ఇన్స్పైరింగ్ హీరోయిన్స్తో కలిసి నటించడం సంతోషంగా ఉంది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కృతి సనన్. ఇక వరుణ్ ధావన్తో కలిసి ఆమె నటించిన ‘భేడియా’ చిత్రం ‘తోడేలు’గా ఈనెల 25న తెలుగులోనూ విడుదల కాబోతోంది.