
హాలియా, వెలుగు: నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ను సోమవారం కృష్ణానది యాజమాన్య బోర్డ్ చైర్మన్ అశోక్ గోయల్ పరిశీలించారు. ఇటీవలే కేఆర్ఎంబీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న గోయల్.. అవగాహన కోసం కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని ప్రధాన ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు . ఈ సందర్భంగా కృష్ణానది రివర్ బోర్డ్ ఉన్నత అధికారులు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉన్నత అధికారులు, జెన్కో అధికారులతో కలిసి ప్రధాన జల విద్యుత్ కేంద్రంలోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు .
అనంతరం నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రతి విభాగాన్ని పరిశీలించారు. సాగర్ ప్రధాన డ్యాం, గ్యాలరీ, డ్యాం క్రైస్ట్ గేట్లు, స్పిల్ వే, ప్రధాన జల విద్యుత్ కేంద్రం, కుడి కాలువ, ఎడమ కాలువల పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బౌద్ధ వారసత్వ సంపద నిలయమైన బుద్ధవనంను సందర్శించారు. ఆయనతోపాటు కేఆర్ఎంబీ సభ్యులు సంకువ, వరలక్ష్మి దేవి, డీఈ అజయ్ యాదవ్, ఏఈ రాజేశ్ చారి, నాగార్జునసాగర్ డ్యాం ఎస్ఈ నాగేశ్వరరావు, ఈఈ .మల్లికార్జున రావు, డీఈ. శ్రీనివాస్ రావు, ఏఈలు కృష్ణయ్య , సత్యనారాయణ తదితరులు ఉన్నారు.