
- ఎగువ ప్రాజెక్టుల ఔట్ఫ్లోకు, దిగువ ప్రాజెక్టుల్లో ఇన్ ఫ్లోకు భారీ తేడా
- లెక్కలు తేల్చే పనిలో కృష్ణా బోర్డు
- తెలంగాణ, ఏపీ ఇంజినీర్లతో కమిటీ
- చర్చించేందుకు వచ్చే నెల 4న మీటింగ్
హైదరాబాద్, వెలుగు: కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల నుంచి విడుదల చేస్తున్న నీళ్లకు, దిగువన ప్రాజెక్టుల్లో చేరుతున్న నీళ్లకు మధ్య తేడాను తెలుసుకునేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చర్యలు చేపట్టింది. దీనిపై స్టడీ చేసేందుకు కేఆర్ఎంబీ ఇంజినీర్ ఆనంద్కుమార్ కన్వీనర్గా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఇంజినీర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మీటింగ్ నవంబర్ 4న ఉంటుందని సోమవారం ఇరు రాష్ట్రాల అధికారులకు బోర్డు సమాచారం ఇచ్చింది.
ఏపీ ఫిర్యాదు నేపథ్యంలో..
కర్నాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు దిగువన సీడబ్ల్యూసీ ఏర్పాటు చేసిన గేజ్ స్టేషన్లో రికార్డ్ అవుతున్న ఔట్ ఫ్లోకు, జూరాలకు వచ్చి చేరుతున్నట్టుగా చెబుతున్న ఇన్ఫ్లోకు మధ్య తేడాలున్నాయని ఏపీ ఆరోపిస్తోంది. 2016–17 వాటర్ ఇయర్లో కర్నాటకలోని హువన్హెగ్టి, యాద్గీర్ గేజ్ స్టేషన్ల వద్ద 442 టీఎంసీల ఔట్ ఫ్లో రికార్డు అయింది. అయితే ఆ ఏడాది జూరాలకు వచ్చి చేరింది 372 టీఎంసీలు మాత్రమేనని ఈ ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. ఆ ప్రకారం 70 టీఎంసీల నీళ్లకు లెక్క తేలలేదు. 2017–18 వాటర్ ఇయర్లో 52 టీఎంసీలు, 2019-19లో 51 టీఎంసీల నీళ్లు ఇలాగే లెక్కలోకి రాలేదు. ఈ విషయాన్ని ఏపీ జలవనరుల శాఖ అధికారులు గతంలో బోర్డు దృష్టికి తీసుకువచ్చారు.
శ్రీశైలం–సాగర్ నీటి లెక్కల్లోనూ తేడాలు
నారాయణపూర్–జూరాల మధ్యనే కాదు, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్కు చేరిన నీటి లెక్కల్లోనూ భారీ తేడాలున్నట్టుగా బోర్డు గుర్తించింది. 2018–19లో 44 టీఎంసీల నీళ్లకు లెక్క తేలలేదు. ఏ ప్రాజెక్టు నుంచైనా విడుదల చేసిన నీటిలో తర్వాతి ప్రాజెక్టుకు వచ్చే సరికి 10 శాతం తక్కువగా ఉండవచ్చని, కానీ కృష్ణాలో మాత్రం 23 శాతానికి మించి తేడా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై సెంట్రల్ వాటర్, పవర్ రీసెర్చ్ సెంటర్తో సర్వే చేయించాలని గతంలో బోర్డు నిర్ణయం తీసుకుంది. ఏమైందో ఏమో తెలియదు కానీ సర్వే మాత్రం జరగలేదు. దీంతో ప్రాజెక్టుల్లోని నీళ్లు ఏమవుతున్నాయో నిగ్గు తేల్చేందుకు బోర్డు రంగంలోకి దిగింది. 4న జరిగే మీటింగ్కు అన్ని ప్రాజెక్టుల ఇంజనీర్లతో పాటు ఇరు రాష్ట్రాల నుంచి తమ ప్రతినిధులను పంపాలని ఈఎన్సీలకు బోర్డు సూచించింది.