
హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ నోటిని అదుపులో పెట్టుకోవాలని, లేదంటే భవిష్యత్లో మూల్యం చెల్లించక తప్పదని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి.నిరంజన్ హెచ్చరించారు. అమరులను బలి తీసుకున్నది సోనియానేనంటూ మాట్లాడడం దారుణమన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. అధికారమదంతో కన్నూమిన్నూ కానకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కళ్లున్న కబోది కేటీఆర్అని ఫైర్ అయ్యారు. సోనియా గాంధీ చొరవతోనే తెలంగాణ వచ్చిందని ప్రపంచమంతా ప్రశంసించిందని గుర్తు చేశారు. చివరకు కేసీఆర్ కూడా తొలి అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని చెప్పారన్నారు.
అమరులను సోనియా బలి తీసుకుంటే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేసీఆర్ కుటుంబమంతా సోనియాగాంధీ ఇంటికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. సీఎం పదవి దక్కదన్న నిరాశతోనే కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. పీసీసీ చీఫ్ గురించి తీన్ఫీట్ అని మాట్లాడుతున్న కేటీఆర్.. తానేమైనా ఆజానుబాహుడనుకుంటున్నారా అని నిరంజన్ ప్రశ్నించారు.