- రెండున్నరేండ్ల పాలన చూశాక ఎవరూ ఓటు వేయరు: కేటీఆర్
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలు మళ్లీ ఆ పార్టీకి ఓటేయరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కనీసం 20 ఏండ్ల దాకా అధికారంలోకి రాదన్నారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని, దీనికితోడు ఆ పార్టీ చేస్తున్న అవినీతి అరాచకాలు, కుంభకోణాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
శనివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో హైదరాబాద్ నందినగర్ నివాసంలో ఆయన సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అవినీతి అడ్డగోలుగా పెరిగిపోయిందని, అన్ని అంశాల్లోనూ కమీషన్లు, కాసుల కక్కుర్తి కోసమే చూస్తున్నదని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో భూములతో పాటు అనేక మైనింగ్ కుంభకోణాల్లో స్వయంగా మంత్రులే ఉన్నారని ఆరోపించారు.
