
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లో వర్షం పడి ట్రాఫిక్ జామ్ అయితే మున్సిపల్ మంత్రిగా తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, కానీ దానికి తానొక్కడినే బాధ్యుణ్ని కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ఖాజాగూడలో పాలియేటివ్ కేర్ ‘స్పర్శ్ హాస్పిస్’ కొత్త బిల్డింగ్ ను ఆయన ప్రారంభించారు. ఐదేండ్ల క్రితం బంజారాహిల్స్లో 8 బెడ్స్తో ప్రారంభమైన స్పర్శ్ హాస్పిస్.. ప్రభుత్వ సహకారంతో ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ నిర్మించుకోవడం గర్వంగా ఉందన్నారు. ఈ సంస్థకు ప్రాపర్టీ, వాటర్ ట్యాక్స్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. గవర్నమెంట్ లోనూ పాలియేటివ్ కేర్ ట్రీట్మెంట్ ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. దీన్ని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో అమలు చేస్తామన్నారు. కేన్సర్ బాధితుల కోసం ఇంకెంతో చేయాలని అనుకుంటున్నామని.. ఇందుకోసం టాటా ట్రస్ట్, హెటిరో గ్రూప్తో కలిసి పని చేస్తామని తెలిపారు. ఇంకెవరైనా ముందుకొచ్చినా సర్కార్ సహకారం అందజేస్తుందన్నారు. ‘‘మొదట్లో పాలియేటివ్ కేర్ అంటే నాకు తెలియదు. తర్వాత దానిపై స్టడీ చేసి తెలుసుకున్నాను. చివరి దశలో ఉన్న వారికి స్పర్శతో అందించే ఓదార్పు ఎంతో గొప్పది. స్పర్శ్ హాస్పిస్ అలాంటి ఓదార్పును అందిస్తోంది” అని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.