- మంత్రిపై వార్త వేసిన చానెల్ను వదిలేసి.. వేరే చానెళ్లపై కేసులా?: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అధికారపక్షానికి సన్నిహితంగా ఉండే టీవీ చానెల్ఒక మంత్రిపై వేసిన కథనాన్ని కేవలం ఉటంకించినందుకు ఇతర చానెళ్లు, డిజిటల్ మీడియా హ్యాండిళ్లపై దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం ఏకంగా సిట్ ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు.
వార్త వేసిన అసలు చానెల్ మీద చర్యలు తీసుకోకుండా సిట్ పేరుతో కొత్త నాటకాలు ఎందుకని మండిపడ్డారు. ఎవరిని కాపాడేందుకు ఈ సిట్ వేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఓవరాక్షన్ను ప్రజలంతా గమనిస్తున్నారని, మీడియా సంస్థల మీద వేధింపులు ఆపకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు. నిజంగానే ప్రత్యేక దర్యాప్తు చేయాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీ అన్యాయాలు, అక్రమాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సర్కారులో జరుగుతున్న దారుణాలపై ఎందుకు సిట్వేయడం లేదని నిలదీశారు. విచారణల పేరిట కమిషన్లు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ల ఏర్పాటు కేవలం కాలయాపనకేనని ఆయన విమర్శించారు. ప్రశ్నించే గొంతుకలైన మీడియా, డిజిటల్ మీడియా సంస్థలను వేధించడానికే ఈ సిట్ గారడీలు చేస్తున్నారని, పార్టీ అంతర్గత కుమ్ములాటలు, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను దాచిపెట్టేందుకే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు.
