- నియోజకవర్గ కేంద్రాల్లో మాత్రమే కార్యక్రమాలు చేయాలి: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక మలుపు డిసెంబర్ 9 అని, ఆ రోజును విజయ్ దివస్గా ఘనంగా నిర్వహించుకోవాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు కేంద్రం తలొగ్గి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు డిసెంబర్ 9న ప్రకటించిందని గుర్తుచేశారు.
ఆదివారం పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నవంబర్ 29 దీక్షా దివస్ను విజయవంతం చేసినట్లే.. ఇప్పుడు విజయ్ దివస్నూ ఘనంగా నిర్వహించాలని సూచించారు. 60 ఏండ్ల తెలంగాణ ఆకాంక్షకు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష వల్లే ఒక రూపం వచ్చిందని చెప్పారు.
అంతటి ఘనమైన చారిత్రక ఘట్టాన్ని మరోసారి స్మరించుకుంటూ.. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన త్యాగాన్ని గుర్తుచేస్తూ విజయ్ దివస్ను పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అందరూ బిజీగా ఉన్నారని, ఊర్లల్లో కాకుండా నియోజకవర్గ కేంద్రాల్లో మాత్రమే కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన సూచించారు.
నియోజకవర్గ కేంద్రాల్లోని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని సూచించారు. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని చెప్పారు. పార్టీ ఆఫీసులు లేదా ముఖ్యమైన జంక్షన్ల వద్ద విజయానికి సూచికగా గులాబీ రంగు బెలూన్లను ఎగురవేయాలన్నారు. హైదరాబాద్ నిమ్స్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలన్నారు.
