హైదరాబాద్, వెలుగు: కేటీఆర్కు పనిపాటా లేక కాళేశ్వరం వెళ్లాడని విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదలచేశారు. బీఆర్ఎస్ హయాంలోని కన్నెపల్లి పంప్హౌజ్ నీట మునిగి బాహుబలి మోటార్లన్నీ పాడైన విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు.
కాళేశ్వరం వెళ్లకుండా కేటీఆర్ను ఎవరూ ఆపలేదని, ఒకవేళ ప్రభుత్వం ఆపితే కన్నెపల్లికి ఆయన ఎలా వెళ్లాడని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోతే ఎవరో బాంబులు పెట్టి పేల్చారని చెప్పుకున్న చరిత్ర వారిదని మండిపడ్డారు. గేమ్ ప్లాన్లో భాగంగా కేటీఆర్ కాళేశ్వరం వెళ్లాడని, ఆయన మాటలను తెలంగాణ ప్రజలెవరూ నమ్మరని తెలిపారు.
