ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్త..ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న : కూచుకుళ్ల దామోదర్ రెడ్డి

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్త..ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న  : కూచుకుళ్ల దామోదర్ రెడ్డి
  • ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్త
  • నాలుగున్నరేండ్లు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న
  • బీఆర్ఎస్​ లేని తెలంగాణ కోసం పోరాడుతా
  • రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే
  • విలువల్లేని వ్యక్తుల చేతుల్లో రాష్ట్రం బందీ అయిందని విమర్శ

నాగర్​కర్నూల్, వెలుగు: బీఆర్ఎస్​ను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్​ పార్టీకే ఉందని, ఎమ్మెల్సీగా నాలుగున్నరేండ్లు కొనసాగే అవకాశం ఉన్నా.. ఆ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్​లో చేరుతున్నట్లు బీఆర్ఎస్ అసంతృప్త నేత, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. విలువల్లేని బీఆర్ఎస్​లో కొనసాగడం కంటే రాజకీయ సన్యాసం తీసుకోవడం మంచిదనిపించిందన్నారు. తన కొడుకు కూచుకుళ్ల రాజేశ్ రెడ్డితో పాటు నాగర్​కర్నూల్ నియోజకవర్గంలో తనను నమ్ముకున్న వాళ్లంతా కాంగ్రెస్​లో చేరుతారని స్పష్టం చేశారు. నాగర్​కర్నూల్​లో ఆదివారం డీసీసీ ఆఫీస్ ఓపెనింగ్​కు హాజరైన దామోదర్ రెడ్డి తర్వాత మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతున్నదని, సిద్ధాంతాలు, వైరుధ్యాలను ప్రజలు పెద్ద సమస్యగా చూడటం లేదన్నారు. బీఆర్ఎస్ లేని తెలంగాణ కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ఉజ్వల భవిష్యత్​ కోసం అందరూ ఏకమవుతున్నారని, ప్రస్తుతం ఏ విలువల్లేని వ్యక్తుల చేతుల్లో రాష్ట్రం బందీ అయిందని విమర్శించారు. బీఆర్ఎస్​లో వ్యక్తులను కాకుండా వ్యక్తిత్వాన్ని చంపేస్తారన్నారు. నాగర్​కర్నూల్​లో ఒకరిని గెలిపించిన పాపానికి నాలుగేండ్లు అవమానాలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఒకేపార్టీలో ఉంటూ చిల్లర పంచాయితీలు పెట్టుకునే తత్వం తనది కాదన్నారు. ప్రజల ఆస్తులు, రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని, గతంలో ఇలాంటి పరిస్థితి లేదని విమర్శించారు. ఈనెల 20న కొల్లాపూర్​లో నిర్వహించే బహిరంగ సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్​లో పార్టీలో చేరుతానని ప్రకటించారు. 

టికెట్ ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తాం

వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పని చేస్తామని దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ మంత్రి నాగం జనార్దన్​ రెడ్డితో కలిసి ముందుకెళ్తానన్నారు. నాగర్​కర్నూల్ అసెంబ్లీ నుంచి పార్టీ టికెట్ కేటాయించే విషయంలో సర్వేల ఆధారంగా హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. నాగర్​కర్నూల్​లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే తన లక్ష్యమని తెలిపారు. పార్టీ టికెట్ తన కుమారుడికి వచ్చినా, నాగం జనార్దన్ రెడ్డికి వచ్చినా అంకిత భావంతో పని చేస్తానని వివరించారు.