సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ దాడులు.. రికార్డ్ లను పరిశీలించిన అధికారులు

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ దాడులు.. రికార్డ్  లను పరిశీలించిన అధికారులు

కూకట్​పల్లి/జీడిమెట్ల, వెలుగు: కూకట్​పల్లి, కుత్బుల్లాపూర్ సబ్​రిజిస్ట్రార్ ఆఫీసుల్లో గురువారం ఏసీబీ అధికారులు వేర్వేరుగా ఆకస్మికంగా దాడులు చేశారు. కుత్బుల్లాపూర్​సబ్​రిజిస్ట్రార్ ఆఫీస్​కు మధ్యాహ్నం వచ్చిన అధికారులు.. రాత్రి 8 గంటల వరకూ తనిఖీలు చేశారు.  అనుమానం ఉన్న డాక్యుమెంట్ల జిరాక్స్​కాపీలను తీసుకున్నారు. 

ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్​రెడ్డి మాట్లాడుతూ.. సూరారంలోని కుత్బుల్లాపూర్​సబ్​రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతి జరుగుతున్నదని, రిజిస్ట్రేషన్​చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్​ చేస్తున్నారనే ఫిర్యాదులు అందాయన్నారు. దీంతో తాము మెరుపు దాడులు చేపట్టినట్లు తెలిపారు. ఈ సమయంలో సుమారు 15 మంది డాక్యుమెంట్​రైటర్లు కార్యాలయంలో ఉన్నారన్నారు. 

ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం రావాలి కానీ డాక్యుమెంట్ రైటర్లు వస్తేనే రిజిస్ట్రేషన్​జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. రిపోర్టును ఉన్నతాధికారులు పంపి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యాలయంలో డబ్బులు కోసం తనిఖీ చేశామని ఎక్కడా డబ్బులు దొరకలేదన్నారు.

 రిజిస్ట్రేషన్​చేసుకునే వారికి ఎలాంటి అంతరాయం కలగకుండా  తనిఖీ చేశామని వివరించారు. అలాగే కూకట్​పల్లి కార్యాలయానికి లోపలి నుంచి తాళాలు వేసి సబ్​రిజిస్ట్రార్​ కోమటిరెడ్డి వేణుగోపాల్​రెడ్డితో సహా కార్యాలయ సిబ్బంది అందరినీ ఏసీబీ అధికారులు విచారించారు. కొన్ని గంటల పాటు ఈ సోదాలు కొనసాగాయి. ఇక్కడ ఆస్తుల రిజిస్ట్రేషన్​వ్యవహారాల్లో అవకతవకలకు సంబంధించి ఏమైనా ఆధారాలు లభించాయా లేదా అన్నది అధికారులు బయటకు  వెల్లడించలేదు.