
హైదరాబాద్ కూకట్పల్లి పీఎస్ లో అరుదైన కేసు నమోదైంది. ప్యాకెట్ పగిలిపోయాయని ( విరిగిపోవడం) రాములు అనే వ్యక్తి తాను ప్యాకెట్ కొన్న రత్నదీప్సూపర్ మార్కెట్ పై ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే....
కూకట్పల్లిలో తాజాగా ఓ ఘటన వెలుగుచూసింది. పాలు పగిలాయని ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్న రాములు అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. తాను ఈ నెల 22న రత్నదీప్ సూపర్ మార్కెట్లో హెరిటేజ్ టోన్డ్ మిల్క్ రెండు ప్యాకెట్లను కొనుగోలు చేశాడు. అదే రోజు ఒక ప్యాకెట్ ను ఉపయోగించుకున్నాడు. మరో ప్యాకెట్ ను మరుసటి రోజు అనగా 23 వ తేది.. సోమవారం వాడేందుకు వేడి చేసేందుకు స్టవ్ పై గిన్నెలో పోసి పెట్టాడు. పాలను మరిగించగా అవి పగిలిపోయాయి. దుర్వాసన కూడా వచ్చింది. దీంతో రత్నదీప్ సూపర్ మార్కెట్కు వెళ్లి ప్రశ్నించగా, దానికి మేం ఏం చేస్తామని స్టోర్ మేనేజర్ దురుసుగా సమాధానం ఇచ్చాడు.
ఇక అంతే రత్నదీప్ సూపర్ మార్కెట్ నిర్వాహకులు ప్రజలను మోసం చేస్తున్నారని, నాణ్యత లేని, గడువు మించిన పదార్థాలను విక్రయిస్తున్నారని, తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు.. 125, 274, 275 బీఎన్ఎస్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా కేవలం ఒక సంస్థ నుండి వచ్చే పాలే కాకుండా ఈ మధ్యకాలంలో పలు సంస్థల పాలు పగులుతున్నాయి, వాసన వస్తున్నాయని వినికిడి కూడా ఎక్కువగా ఉంది. వీటిపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలని ఎంతోమంది వినియోగదారులు కోరుతున్నారు.