హైదరాబాద్, వెలుగు: డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎమ్ తన వినియోగదారుల కోసం ఒక సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా యూజర్లు తమ యూపీఐ ఆటోమేటిక్ పేమెంట్లకు ప్రత్యేక లేబుల్స్ పెట్టుకోవచ్చు. ప్రస్తుతం యూట్యూబ్ ప్రీమియం, గూగుల్ వన్, చాట్ జీపీటీ వంటి వివిధ సబ్స్క్రిప్షన్ల చెల్లింపులు ఒకే మర్చంట్ పేరుతో కనిపిస్తున్నాయి.
దీనివల్ల ఏ సేవ కోసం డబ్బులు కట్ అయ్యాయో గుర్తించడం వినియోగదారులకు కష్టంగా మారుతోంది. ఈ కొత్త ఫీచర్ సహాయంతో ఆటోమేటిక్ పేమెంట్స్ విభాగంలోకి వెళ్లి ప్రతి చెల్లింపునకు నచ్చిన పేరును లేబుల్గా సెట్ చేసుకోవచ్చు. దీంతో పునరావృత చెల్లింపుల నిర్వహణ సులభమవుతుంది.
పొరపాటున అవసరమైన సబ్స్క్రిప్షన్లను రద్దు చేసుకునే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యూజర్లకు తమ ఖర్చులపై మరింత స్పష్టత, నియంత్రణను ఇవ్వడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు అన్నారు.
