- ఎమ్మెల్యే రెడ్యా నాయక్ను నిలదీసిన మహిళా సర్పంచ్
నర్సింహులపేట(దంతాలపల్లి), వెలుగు: గ్రామంలో ఎమ్మెల్యే పర్యటన ఉంటే ఆఫీసర్లు, లీడర్లు కనీసం సొంత పార్టీ సర్పంచులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ను ఆగాపేట సర్పంచ్ సంధ్య నిలదీశారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండలం పెద్దముప్పారం, ఆగాపేట, నిదానపురం గ్రామాల్లో ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఎంపీ కవిత పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. గ్రామానికి సర్పంచ్ నైనా కూడా మహిళనని చిన్నచూపు చూస్తున్నారని సర్పంచ్ సంధ్య వాపోయారు.
తాను కూడా బీఆర్ఎస్ సర్పంచ్ నేనని, అభివృద్ధి కార్యక్రమాలకు, మీటింగులకు కనీసం చెప్పకపోవడం బాధాకరమన్నారు. ఎన్నో సార్లు గ్రామ సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చానని, దొరలున్న చోట ఒకలాగా, మహిళా సర్పంచ్ ఉన్న చోట మరోలాగా చూస్తున్నారని ఎమ్మెల్యేతో వాపోయారు. పెద్దముప్పారంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్ కు రూ.లక్ష నుంచి లక్షా యాభై వేలు ఇచ్చామని, ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేండ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ ఓలాద్రి ఉమ, పార్టీ మండల అధ్యక్షుడు ధర్మారపు వేణు, బీఆర్ఎస్ డోర్నకల్ యువజన నాయకులు రవిచంద్ర, సర్పంచులు పాల్గొన్నారు. -