బస్‌ పాస్‌ రేట్లు పెంచిన తెలంగాణ ఆర్టీసీ.. ఆర్డినరీ బస్ పాస్ ధర రూ.1150.. రేటు పెరిగాక ఎంతంటే..

బస్‌ పాస్‌ రేట్లు పెంచిన తెలంగాణ ఆర్టీసీ.. ఆర్డినరీ బస్ పాస్ ధర రూ.1150.. రేటు పెరిగాక ఎంతంటే..

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బస్ పాస్ రేట్లను పెంచింది. సోమవారం నుంచి కొత్త బస్ పాస్ ధరలు అమల్లోకి వచ్చాయి. సాధారణ ప్రజల తీసుకునే బస్ పాసులతో పాటు, స్టూడెంట్ పాస్ ధరలను చార్జీలను కూడా ఆర్టీసీ పెంచింది. 20 శాతం పైగా బస్ పాస్ రేట్లను ఆర్టీసీ పెంచింది. 1150 రూపాయలుగా ఉన్న ఆర్డినరీ పాస్ ధర పెంపు తర్వాత 1400 రూపాయలకు చేరింది.

1300 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ 1600 రూపాయలకు చేరింది. 1450 రూపాయలుగా ఉన్న మెట్రో డీలక్స్ పాస్ 1800 రూపాయలైంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలను కూడా ఆర్టీసీ పెంచింది. హైదరాబాద్ లో ఇటీవలే మెట్రో రైలు టికెట్ ఛార్జీలు కూడా పెరిగిన సంగతి తెలిసిందే. ఇలా.. బస్ పాస్ రేట్లు, మెట్రో టికెట్ రేట్లు పెరగడంతో ఉద్యోగులు, విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

బస్ పాస్ రేట్ల పెంపుపై టీజీఎస్ ఆర్టీసీ మరోసారి ఆలోచన చేయాలని కోరుతున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ ధరలు పెంచిన సమయంలో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. దీంతో.. పెంచిన ధరలపై 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అయితే.. ఎల్ అండ్ టీ సంస్థ.. అన్ని స్లాబ్లలో ఈ రాయితీని అమలు చేయకుండా మరోసారి చాకచక్యాన్ని ప్రదర్శించింది. టికెట్ కొనుగోలు సమయంలో చిల్లర సమస్యను సాకుగా చూపిస్తూ డిస్కౌంట్లలో గందరగోళం సృష్టించడం ప్రయాణికుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.