న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇండియా పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ 21–17, 13–21, 18–21తో చైనీస్ తైపీకి చెందిన వరల్డ్ 13వ ర్యాంకర్ లిన్ చున్-యీ చేతిలో ఓడిపోయాడు. గంటా 8 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో లక్ష్య సేన్ తొలి గేమ్ను గెలిచి శుభారంభం చేశాడు. కానీ తర్వాతి రెండు గేమ్స్లో అనూహ్యంగా తడబడిన సేన్.. అనవసర తప్పిదాలు చేశాడు.
గురువారం జరిగిన మెన్స్ డబుల్స్ ప్రిక్వార్టర్స్లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి 25–-27, 21–-23, 19–-21తో హీరోకి మిడోరికావా– -- క్యోహీ యామాషితా (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది. అయితే, మూడో గేమ్లో ఇరు జంటలూ 15–-15తో సమానంగా ఉన్నప్పుడు ఒక షాట్ ఆడే క్రమంలో సాత్విక్ నెట్ను తాకాడని చైర్ అంపైర్ ‘ఫాల్ట్’గా ప్రకటించడం వివాదాస్పదమైంది.
స్టేడియంలో కోతులు, పక్షులు..షట్లర్ల ఇక్కట్లు..
ఈ టోర్నీలో కాలుష్యం, చలి వంటి వాతావరణ సమస్యలతో పాటు ఇందిరా గాంధీ ఇండోర్స్టేడియంలో పక్షుల రెట్టలు పడటం, కోతులు ప్రత్యక్షమవ్వడం వంటి వింత సంఘటనలు నిర్వాహకులకు పెద్ద తలనొప్పిగా మారాయి. గురువారం హెచ్ ఎస్ ప్రణయ్ మ్యాచ్ సందర్భంగా పక్షుల రెట్టలు కోర్టులో పడటం వల్ల ఆట నిలిచిపోవడంపై ఆటగాళ్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఇక వాయు కాలుష్యం కారణంగా శ్వాస తీసుకోవడం కష్టమవుతోందని లో కీన్ యూ వంటి ఇంటర్నేషనల్ స్టార్లు ఫిర్యాదు చేశారు. ఈ విమర్శలపై స్పందించిన ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ స్టేడియం నిర్వహణలోని లోపాలను అంగీకరిస్తూనే, భవిష్యత్తులో జరగబోయే వరల్డ్ చాంపియన్షిప్ నాటికి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి మెరుగైన వాతావరణాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చింది.
