
న్యూఢిల్లీ: లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ త్వరలో ఐపీఓకి రానుంది. ఈ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ. 1,700 కోట్లు సేకరించేందుకు డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) పేపర్లను సెబీ వద్ద ఫైల్ చేసింది. వీటి ప్రకారం, ఈ ఐపీఓలో రూ.1,200 కోట్ల విలువైన ఫ్రెష్ షేర్ల ఇష్యూ ఉంటుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రమోటర్ ఎం కిరణ్ కుమార్ జైన్ రూ.500 కోట్ల విలువైన షేర్లను అమ్మనున్నారు.
ఫ్రెష్ ఇష్యూ నుంచి వచ్చే నిధులను ఇండియాలో 12 కొత్త స్టోర్స్ ఏర్పాటు చేయడానికి వాడతామని, జనరల్ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగిస్తామని కంపెనీ చెబుతోంది. ఈ ఐపీఓకి బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఆనంద్ రాఠీ అడ్వైజర్స్ లిమిటెడ్, ఈక్విరస్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ పనిచేస్తాయి. లలితా జ్యువెలరీ కిందటేడాది డిసెంబర్ 31 నాటికి, ఇండియాలోని 46 సిటీలలో 56 స్టోర్లను నిర్వహిస్తోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరిలో స్టోర్లను ఆపరేట్ చేస్తోంది.