భువనగిరి, పోచంపల్లిలో భూమికి మస్తు డిమాండ్!

భువనగిరి, పోచంపల్లిలో భూమికి మస్తు డిమాండ్!
  •  యాదాద్రి జిల్లాలో భూముల విలువ పెంపునకు కసరత్తు
  •  రిజిస్ట్రేషన్, బహిరంగ మార్కెట్​ విలువ సేకరించిన తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు 
  •  సర్కారుకు చేరిన లెక్కలు
  •  గరిష్టంగా ఎకరానికి రూ. 1.36 కోట్లుగా రిజిస్ట్రేషన్ విలువ

యాదాద్రి, వెలుగు :  యాదాద్రి భువనగిరి జిల్లాలో భూముల మార్కెట్ విలువను సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, రిజిస్ట్రేషన్, బహిరంగ మార్కెట్ విలువల నివేదికను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి సమర్పించారు. మార్కెట్​విలువను ప్రభుత్వం సవరిస్తే భువనగిరి, భూదాన్​పోచంపల్లిలో భూములకు మస్తు డిమాండ్ ​పెరగనుంది.  

మార్కెట్ విలువ సేకరణ.. 

భూముల మార్కెట్​ విలువను సవరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తహసీల్దార్లు, సబ్​ రిజిస్టార్లు సర్వే నెంబర్ల వారీగా మార్కెట్​ విలువ సేకరించారు. ఏఏ సర్వే నెంబర్లలో భూమి నేషనల్, స్టేట్​ హైవేలతో పంచాయతీ రోడ్ల పక్కన ఉన్నాయో వివరాలను సేకరించారు. రోడ్డు సౌకర్యం సరిగా లేని భూములను డేటా సేకరణలో అర్బన్, కమర్షియల్, రూరల్​ విభాగాలుగా భూములను విభజించారు. వెంచర్లలోని ప్లాట్లకు సంబంధించిన వివరాలను పేర్కొన్నారు. వీటన్నిటితో పాటు బహిరంగ మార్కెట్​లో ఆ భూములు విలువ ఎంత ఉందో సేకరించారు. 

మార్కెట్​ వ్యాల్యూ రూ. 1.36 కోట్లు..

జిల్లాలో భూముల ప్రస్తుత రిజిస్ట్రేషన్​ మార్కెట్​ విలువ భువనగిరి, చౌటుప్పల్, బీబీనగర్, భూదాన్​ పోచంపల్లి, ఆలేరు ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లోనే వ్యవసాయ భూములు, ఇండ్ల స్థలాల మార్కెట్​ రేట్లతో పాటు బహిరంగ మార్కెట్​లోనూ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో మార్కెట్​ వ్యాల్యూ మరీ తక్కువగా ఉంది. భువనగిరి టౌన్​తో పాటు మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరిలోని పలు సర్వే నెంబర్లలో ఎకరం ధర రూ. 1.36 కోట్లు, రూ. 1.18 కోట్లు, భూదాన్​ పోచంపల్లిలో ఎకరానికి రూ. 1.18 కోట్లుగా ఉంది.

 మిగిలిన చోట్ల రూ. 75 వేల నుంచి రూ. 94 లక్షల వరకూ రిజిస్ట్రేషన్​ వ్యాల్యూ ఉంది. జిల్లాలో ఎక్కడెళ్లినా  ఎకరాకు రూ. 20 లక్షలకు తక్కువ లేదు. మండల హెడ్​ క్వార్టర్​ లో ఎకరాకు రూ. కోటికి పైగా అర్బన్​ ప్రాంతాలకు వస్తే ఎకరాకు రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకూ పలుకుతోంది. ఇండ్ల స్థలాల విషయానికొస్తే రిజిస్ట్రేషన్​ వ్యాల్యూ గ్రామాల్లో గజం రూ. 500 నుంచి రూ. 2,200 వరకూ ఉంది. అర్బన్​ఏరియాల్లో గజం రూ. 7 వేల నుంచి  రూ. 21,200 వరకూ ఉంది.

బహిరంగ మార్కెట్​ విషయానికొస్తే ఏ మారు మూల ప్రాంతానికి వెళ్లినా గజం రూ. 5 వేలకు తక్కువగా లేదు. మోత్కూరు, ఆత్మకూరు (ఎం) లాంటి మండలాల్లో గజం రూ. 20 వేలకు తక్కువగా లేదు. ఇక భువనగిరి, చౌటుప్పల్​ విషయానికొస్తే నేషనల్​ హైవేపై గజం రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకూ పలుకుతోంది. 

విలువ సవరిస్తే ఇలా..  

యాదాద్రి జిల్లా మీదుగా విజయవాడ, వరంగల్​ హైవేలు వెళ్తుండగా ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్ట టెంపుల్​ఈ జిల్లాలోనే ఉంది. గత ప్రభుత్వం ఈ టెంపుల్​ డెవలప్​మెంట్​ను చేపట్టడంతో జిల్లాలో రియల్​ ఎస్టేట్​ రంగం ఊపందుకొంది. బహిరంగ మార్కెట్​లో ఇక్కడి భూముల విలువ భారీగా పెరిగాయి. మార్కెట్​ విలువను రూరల్, అర్బన్​, కమర్షియల్ విభాగాల్లో వేర్వేరుగా పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా పెంచితే ఒక్కోచోట ఒక్కో విధంగా భూముల మార్కెట్​ విలువ పెరిగే అవకాశం ఉంది. భూముల మార్కెట్​ విలువను 10  శాతానికి తగ్గకుండా, 100 శాతానికి మించకుండా పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.

దీంతో జిల్లాలో భారీ ఎత్తున మార్కెట్​ విలువ పెరిగే అవకాశం కన్పిస్తోంది. ఇదే జరిగితే భువనగిరిలో అత్యధికంగా ఎకరానికి రూ. 1.36 కోట్లు ఉన్న భూమికి మధ్యస్తంగా 30 శాతం  మార్కెట్​ వ్యాల్యూ పెంచితే రూ. 1.72 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. భూదాన్​ పోచంపల్లిలో ఎకరానికి రూ. 1.18 కోట్లుగా ఉంటే మార్కెట్​ వ్యాల్యూ పెరిగితే రూ. 1.54 కోట్లకు పెరగనుంది.  భువనగిరి మెయిన్​ రోడ్డుపై గజం రూ. 32,200 ఉండగా మార్కెట్​ వ్యాల్యూ  పెరిగిన తర్వాత గజం రూ. 42 వేలు అవుతుంది. 

కొనుగోళ్లపై ఎఫెక్ట్​!

భూముల మార్కెట్​ విలువ పెంచితే కొనుగోళ్లపై ప్రభావం పడే అవకాశముందని స్థిరాస్తి వ్యాపారులు అంటున్నారు. ఇప్పటికే రియల్​ ఎస్టేట్​ బిజినెస్​ వెనుకబడిందని, ఇప్పటికే క్రయ విక్రయాలు చాలా వరకూ తగ్గిపోయాయని చెబుతున్నారు. ఇప్పుడు మార్కెట్​ విలువ పెరిగితే, స్టాంప్​ డ్యూటీ పెరిగి ఆ ప్రభావం కొనుగోళ్లపై పడుతుందని 
అభిప్రాయపడుతున్నారు. 

భూమి విలువ ఎక్కువ ఇక్కడే..  

యాద్రాద్రి భువనగిరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్​లో రేటు ఎక్కువగా ఉంది. భువనగిరి మండలంలోని భువనగిరి, రాయగిరి సహా సూరేపల్లి వరకూ దాదాపు 25 గ్రామాల్లోని వందలాది సర్వే నెంబర్లలోని భూములకు అత్యధికంగా ధర పలుకుతాయని గుర్తించారు.  
    
భువనగిరి టౌన్​లో ఎల్లమ్మ టెంపుల్​ నుంచి జగదేవ్​పూర్​ చౌరస్తా, పాత బస్టాండ్​, నల్గొండ రోడ్​లోని స్థలాలను కమర్షియల్​ జోన్​గా పేర్కొన్నారు. 
    
చౌటుప్పల్​, భూదాన్​ పోచంపల్లి, బీబీనగర్​, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు సహా పలు మండలాల్లో మెయిన్​ రోడ్డు పరిసరాల్లో  ఉన్న భూములను ఎక్కువ విలువగల భూములుగా గుర్తించారు. 
    
బొమ్మల రామారం మండలంలో వందకు పైగా గుర్తించిన సర్వే నెంబర్లలో సుమారు 60 నెంబర్లను ప్రైమ్​ ల్యాండ్​గా పేర్కొన్నారు. వీటిలో బొమ్మల రామారంతో పాటు నాగినేనిపల్లి, మర్యాల, చీకటిమామిడి, రామలింగంపల్లి, రంగాపూర్​, మేడిపల్లి గ్రామాలూ ఉన్నాయి. రూరల్​ మండలాల్లో మధ్యస్తంగా విలువగల భూములుగాగుర్తించారు.