పాట్నా/న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో తన కూతురు మీసా భారతితో కలిసి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. నాలుగున్నర గంటలకు పైగా విచారణ జరిపిన ఈడీ అధికారులు 40 ప్రశ్నలను అడిగారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం, ఇందులో ప్రమేయం ఉన్న వారి వివరాలపై ఈడీ ఆరా తీసింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఈ కుంభకోణం జరిగింది.
సోరెన్ కారు సీజ్..
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను విచారించేందుకు ఈడీ అధికారులు సోమవారం ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో సోరెన్ అందుబాటులో లేరు. ఆయన ఎక్కడ ఉన్నారన్నది తెలియలేదు. దీంతో అక్రమంగా కొన్నట్లు భావిస్తున్న బీఎండబ్ల్యూ కారును, కొన్ని డాక్యుమెంట్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. కాగా, ఈడీ ఇప్పటివరకూ 7 సార్లు సమన్లు జారీ చేయగా, సోరెన్ విచారణకు హాజరుకాలేదు.