సర్వర్ల మొరాయింపు.. తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు బ్రేక్

 సర్వర్ల మొరాయింపు.. తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు బ్రేక్
  •     ఆఫీసుల వద్ద జనం పడిగాపులు
  •     వారంలో రెండు మూడు రోజులు ఇదే తీరు
  •     స్లాట్​ విధానం అన్​లిమిటెడ్​ చేయాలనే డిమాండ్​  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. టెక్నికల్ సమస్య కారణంగా ప్రధాన సర్వర్లు పనిచేయకపోవడంతో ఉదయం నుంచే స్లాట్ బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, చలాన్ల చెల్లింపులు, భూ బదలాయింపులు నిలిచిపోయాయి. వారంలో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి ఉండడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద జనం భారీగా వేచి చూడాల్సి వస్తున్నది. 


ప్రభుత్వం 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్తున్నప్పటికీ, సర్వర్ల వేగం మందగించడం, ఈ-కేవైసీ మొరాయించడంతో సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. రద్దీగా ఉండే సబ్​ రిజిస్ర్టార్​ కార్యాలయాల్లో స్లాట్ దొరకడానికే 10 నుంచి 15 రోజులు పడుతుండడంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తీసుకొచ్చిన మార్పులు ఆశించిన ఫలితాలు ఇవ్వాలంటే క్షేత్రస్థాయి పర్యవేక్షణ పెరగాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. స్లాట్ బుక్ చేసుకున్న వారు ట్రాఫిక్ లేదా ఇతర కారణాల వల్ల నిర్ణీత సమయానికి చేరుకోలేకపోతే స్లాట్ రద్దవుతుండడంతో ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారు. అత్యవసర అవసరాల కోసం ఆస్తులు అమ్ముకునే వారు ఈ జాప్యం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు పలు కార్యాలయాల్లో కనీస మౌలిక వసతులైన మంచినీరు, సరిపడా కుర్చీలు, వాష్ రూమ్‌‌‌‌లు లేకపోవడంతో గంటల తరబడి వేచి చూడడం భారంగా మారింది. అటు పర్యవేక్షణ లోపం వల్ల సిబ్బందిలో జవాబుదారీతనం తగ్గుతున్నదని, డాక్యుమెంట్లలో చిన్నపాటి తప్పులు దొర్లినా వాటిని సవరించేందుకు బాధితులు మళ్లీ ‘రెక్టిఫికేషన్’ రుసుము చెల్లించాల్సి వస్తున్నదని వినియోగదారులు వాపోతున్నారు. ఈ సమస్యలపై తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ స్పందించింది. సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రస్తుత స్లాట్ విధానాన్ని మరింత సరళతరం చేయాలని లేదంటే అన్‌‌‌‌లిమిటెడ్ స్లాట్లను అందుబాటులోకి తేవాలని సూచించింది. ఏదైనా కారణంతో రిజిస్ట్రేషన్ రద్దయితే చలానా సొమ్మును 15 రోజుల్లోగా వాపస్ చేసేలా నిబంధనలు మార్చాలని పేర్కొంది. అలాగే ప్రభుత్వమే తప్పుల్లేని డాక్యుమెంట్లు తయారు చేసి ఇచ్చే విధానాన్ని తీసుకురావాలని, తద్వారా సామాన్యులు మోసగాళ్ల బారిన పడకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది.