- చెలరేగిన స్మృతి, హర్మన్ప్రీత్, రిచా ఘోష్
- ఐదు వికెట్లు తీసిన దీప్తి శర్మ.. పాక్ బ్యాటర్లు అట్టర్ ఫ్లాఫ్
బర్మింగ్హామ్: విమెన్స్ టీ20 వరల్డ్ కప్లో ఇండియా అమ్మాయిలు అదరగొట్టారు. బ్యాటింగ్, బౌలింగ్లో సూపర్ షో చూపెడుతూ పాకిస్తాన్ను పడగొట్టారు. స్మృతి మంధాన (44 బాల్స్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 68), హర్మన్ప్రీత్ కౌర్ (35 బాల్స్లో 4 ఫోర్లతో 36), రిచా ఘోష్ (17 బాల్స్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 34) మెరుపులకు తోడు స్పిన్నర్లు దీప్తి శర్మ (5/10), శ్రీచరణి (3/21) మ్యాజిక్ చేయడంతో.. ఆదివారం జరిగిన గ్రూప్–1 లీగ్ మ్యాచ్లో టీమిండియా 64 రన్స్ భారీ తేడాతో పాక్ను చిత్తు చేసింది. టాస్ నెగ్గిన ఇండియా 20 ఓవర్లలో 170/6 స్కోరు చేసింది. తర్వాత పాక్ 17 ఓవర్లలో 106 రన్స్కే ఆలౌటైంది. మునీబా అలీ (35 బాల్స్లో 5 ఫోర్లతో 41) మినహా మిగతా వారు నిరాశపర్చారు. దీప్తికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
స్మృతి నిలకడ..
ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇండియా ఇన్నింగ్స్ అనుకున్న స్థాయిలో సాగలేదు. ఇన్నింగ్స్ ఐదో బాల్కే ఓపెనర్ షెఫాలీ వర్మ (6), నాలుగో ఓవర్లో జెమీమా రోడ్రిగ్స్ (1) పెవిలియన్కు చేరారు. దాంతో ఇండియా 18/2 స్కోరుతో కష్టాల్లో పడింది. ఆరంభం నుంచి నిలకడగా ఆడిన స్మృతికి కెప్టెన్ హర్మన్ అండగా నిలిచింది. ఈ ఇద్దరు నెమ్మదిగా ఆడటంతో ఇండియా 30/2తో పవర్ప్లేను ముగించింది.
ఫీల్డింగ్ పెరిగిన తర్వాత ఈ ఇద్దరు పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. 8వ ఓవర్లో స్మృతి ఇచ్చిన క్యాచ్ను అలియా జారవిడిచింది. తర్వాతి ఓవర్లో హర్మన్ రెండు ఫోర్లు, పదో ఓవర్లో స్మృతి సిక్స్తో ఫస్ట్ టెన్లో ఇండియా స్కోరు 65/2కు పెరిగింది. 11వ ఓవర్లో ఫోర్తో స్మృతి 34 బాల్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. 13వ ఓవర్లో లాంగాన్ స్మృతి ఇచ్చిన క్యాచ్ను సైరా వృథా చేయడంతో అది సిక్స్గా మారింది.
ఈ ఓవర్లో హర్మన్ స్వీప్ షాట్లతో రెండు ఫోర్లు రాబట్టింది. చివరకు 14వ ఓవర్లో ఫోర్ కొట్టిన స్మృతిని రమీన్ షామిమ్ (1/30) ఔట్ చేయడంతో మూడో వికెట్కు 91 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. రెండు బాల్స్ తర్వాత భారతి ఫుల్మాలి (3) కూడా వెనుదిరిగింది. 15 ఓవర్లలో 117/4 స్కోరు చేసిన ఇండియా ఇన్నింగ్స్ను రిచా ఘోష్ మెరుపు వేగంతో ముందుకు తీసుకెళ్లింది. 17వ ఓవర్లో హర్మన్ వెనుదిరిగినా.. 19వ ఓవర్లో దీప్తి (12 నాటౌట్) 4, రిచా 4, 6, 4, 4తో 23 రన్స్ దంచారు. లాస్ట్ ఓవర్లో ఫోర్ కొట్టి రిచా ఔట్ కావడంతో ఆరో వికెట్కు 45 రన్స్ జతయ్యాయి. సాదియా ఇక్బాల్, ఫాతిమా సనా చెరో రెండు వికెట్లు తీశారు.
బౌలర్లు సూపర్..
ఛేజింగ్లో పాక్ బ్యాటర్లను ఇండియా బౌలర్లు ఆటాడుకున్నారు. ఫోర్తో ఖాతా తెరిచిన మునీబా అలీ స్థిరంగా ఆడినా.. రెండో ఎండ్లో వరుస విరామాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. మూడో ఓవర్లో మునీబా రెండు ఫోర్లు, గుల్ ఫెరోజా (12) రెండు ఫోర్లతో టచ్లోకి వచ్చారు. కానీ ఐదో ఓవర్లో దీప్తి శర్మ.. గుల్ ఫెరోజాను ఔట్ చేసి తొలి వికెట్కు 38 రన్స్ పార్ట్నర్షిప్ను బ్రేక్ చేసింది. ఆయేషా జాఫర్ (12) రెండు ఫోర్లతో పవర్ప్లేలో పాక్ 52/1 స్కోరు చేసింది. ఏడో ఓవర్లో దీప్తి దెబ్బకు ఆయేషా వెనక్కి వచ్చేసింది. 8వ ఓవర్లో శ్రీచరణి.. సైరా జబీన్ (2) వికెట్ తీసింది.
మునీబాతో కలిసిన నటాలియా పర్వేజ్ (7) కాసేపు బ్యాట్ అడ్డేయడంతో తొలి పది ఓవర్లలో పాక్ 72/3 స్కోరు చేసింది. అయితే 11వ ఓవర్లో దీప్తి కొట్టిన డైరెక్ట్ త్రోకు మునీబా అనూహ్యంగా రనౌటైంది. 9 బాల్స్ తేడాలో ఫాతిమా సనా (0), నటాలియా పర్వేజ్ ఔట్ కావడంతో పాక్ 79/6తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో అలియా రియాజ్ (18), రమీన్ షామిమ్ (4) నిలకడగా ఆడే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. 15వ ఓవర్లో శ్రీచరణి.. రమీన్ వికెట్ తీస్తే.. 17వ ఓవర్లో దీప్తి ట్రిపుల్ స్ట్రోక్ ఇచ్చింది. ఐదు బాల్స్ తేడాలో అలియా రియాజ్, తస్మిన్ రుబాబ్ (0), నషారా సంధు (4)ను ఔట్ చేసి ఇండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 20 ఓవర్లలో 170/6 ( స్మృతి 68, హర్మన్ప్రీత్ 36, రిచా ఘోష్ 34, సాదియా 2/41, ఫాతిమా 2/33). పాకిస్తాన్: 17 ఓవర్లలో 106 ఆలౌట్ (మునీబా 41, దీప్తి 5/10, శ్రీచరణి 3/21).
