ధరణిని అడ్డం పెట్టుకుని అమ్మిన భూమి మళ్లీ అమ్మకం

ధరణిని అడ్డం పెట్టుకుని అమ్మిన భూమి మళ్లీ అమ్మకం

కంప్యూటర్​ ఆపరేటర్​ సహా ఏడుగురిపై  క్రిమినల్​ కేసు

మహబూబ్​నగర్​, వెలుగు: 23 సంవత్సరాల క్రితం ఆ భూమిని అమ్మేశారు. కానీ ఇటీవల కొత్తగా ప్రారంభించిన ధరణి పోర్టల్​లో మాత్రం పాత ఓనర్​పేరు రావడంతో ఇదే అవకాశంగా కొందరు అక్రమాలకు తెర లేపారు. అమ్మిన భూమినే మరోసారి అమ్మేశారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మక్తల్​ పట్టణంలో వెలుగు చూసింది. నారాయణపేట జిల్లా మక్తల్​పట్టణంలోని సర్వే నం. 240ఎ లో 4‌‌‌‌‌‌–05 ఎకరాల స్థలాన్ని 1997 నవంబర్​లో ఉమాబాయి అగర్వాల్​భర్త రవీందర్​కుమార్​అప్పటి మార్కెట్​వాల్యూ ప్రకారం ఉప్పరి వెంకన్న తండ్రి లింగన్న నుంచి కొనుగోలు చేశారు. 1998 ఫిబ్రవరిలో భూమి బదలాయింపులను ఆర్ఓఆర్​లో ఎక్కించారు. అయితే పహాణిలో మాత్రం రెవెన్యూ అధికారులు ఎక్కించలేదు. భూమిని కొనుగోలు చేసిన ఉమాబాయి ఈ స్థలంలో సూర్యజ్యోతి కాటన్​మిల్లు నిర్మించారు. నాలుగేళ్ల క్రితం దీన్ని మూసేశారు.

రికార్డుల్లో వెంకన్న పేరు

240ఎ సర్వే నంబర్​లో కొంత భూమిని మక్తల్​కు చెందిన ఆశిరెడ్డి అనే ఓ పార్టీ నేత తన భార్య పేరుపై కొనుగోలు చేశారు. ఆయన కొన్న భూమిలో భీమా కాలువ వెళ్లడంతో పరిహారం సైతం అందుకున్నారు. 2016లో ప్రభుత్వం భూ ప్రక్షాళన చేపట్టిన సమయంలో 97లో అమ్మిన భూమి ఇంకా ఆన్​లైన్​లో పాత ఓనర్​పేరుతోనే ఉన్నట్లు తెలిసింది. ఉప్పరి వెంకన్నకు పాసుబుక్కులు సైతం వచ్చాయి. ఈ భూమి గురించి అన్ని తెలిసిన ఆశిరెడ్డితోపాటు మరికొందరు నేతలు లక్ష్మారెడ్డి,  నీలప్ప కలిసి దేవరింటి నర్సింహారెడ్డి అనే మరో నాయకుడికి అమ్మినట్లు రిజిస్ట్రేషన్​ చేయించారు. ధరణి పోర్టల్ ​స్టార్ట్​ అయినప్పటి నుంచి మక్తల్​ తహసీల్దార్​ ఆఫీస్​లో భూముల వివరాలను నమోదు చేస్తున్న కంప్యూటర్ ​ఆపరేటర్​ నరేందర్​ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడు. దళారులు, నేతలతో కుమ్మక్కయిన ఆపరేటర్​.. గత నెల 17న ధరణి పోర్టల్​లో 5–17 ఎకరాలు అమ్మినట్లు రిజిస్ట్రేషన్​ పూర్తి చేశారు.

బెడిసికొట్టిన ప్లాన్​

భూమి రిజిస్ట్రేషన్ ​పూర్తయిన తర్వాత కాటన్​మిల్లు యజమానులతో బేరమాడేందుకు సదరు నేతలు వేసిన ప్లాన్​రివర్స్​అయింది. భూమిలో తమకూ వాటా ఉందని.. రాజీ కుదుర్చుకునేలా అసలు యజమానులను ఒప్పించాలని అనుకున్నారు. అయితే భూ హక్కుదారు ఉమాదేవి అగర్వాల్​అక్రమ రిజిస్ట్రేషన్​పై  నారాయణపేట జిల్లా కలెక్టర్​హరిచందనకు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్​ విచారణకు ఆదేశించారు.  నారాయణపేట ఆర్డీవో శ్రీనివాస్ విచారణ జరిపి పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయాలంటూ నవంబర్​27న తహసీల్దార్​కు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో అసలు సూత్రధారి కంప్యూటర్​ఆపరేటర్​ నరేందర్​ను ఔట్​సోర్సింగ్​నుంచి డిస్మిస్​చేయాలని కలెక్టర్​ఆదేశాలిచ్చారు. తహసీల్దార్​ఫిర్యాదు మేరకు మక్తల్ పీఎస్​లో ఏడుగురిపై కేసు నమోదైంది. భూమిని అమ్మేందుకు ప్రోత్సహించి డాక్యుమెంట్​లో సాక్షి సంతకాలు చేసిన రాజుల ఆశిరెడ్డి, సంగంబండ లక్ష్మారెడ్డి, నీలప్ప, భూమి కొనుగోలు చేసిన దేవరింటి నర్సింహారెడ్డి, అమ్మిన ఉప్పరి వెంకప్ప, అతని అల్లుడు కిష్టప్ప, కంప్యూటర్​ ఆపరేటర్​ నరేందర్​పై చీటింగ్​ కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాములు చెప్పారు. వీరందరికి నోటీసులు జారీ చేశామని, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నరేందర్​పరారీలో ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు.

For More News..

10 లక్షలకే కిలో బంగారమంటూ ఫోన్ కాల్

పెళ్లి రోజునే సవతి పిల్లలను చంపి ఉరేసుకున్న మహిళ

రైతు హక్కులకూ రక్షణ ఉండాలె