
హైదరాబాద్, వెలుగు: అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ), భారతదేశానికి చెందిన మెడికల్ డివైజెస్ కంపెనీ 'మెరిల్'లో 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,723 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడితో మెరిల్లో ఏడీఐఏకు సుమారు 3శాతం వాటా లభించనుంది. ఈ ఒప్పందం ద్వారా మెరిల్ మార్కెట్ విలువ 6.6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.56,859 కోట్లు)చేరుతుందని అంచనా.
ఈ పెట్టుబడిని వ్యాపార విస్తరణ, రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ కార్యకలాపాలను బలోపేతం చేయడానికి ఉపయోగించుకోనుంది. గుజరాత్లోని వాపిలో హెడ్ ఆఫీసు ఉన్న మెరిల్, గుండె సంబంధిత పరికరాలు, సర్జికల్ రోబోటిక్స్, ఆర్థోపెడిక్ ఇంప్లాంట్లు వంటి మెడికల్ పరికరాలను తయారు చేస్తుంది. ఈ ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి రావాల్సి ఉంది.