కండక్టర్‌ ఉద్దేశపూర్వకంగా టికెట్‌ జారీ చేయలేదు: TSRTC

కండక్టర్‌ ఉద్దేశపూర్వకంగా టికెట్‌ జారీ చేయలేదు: TSRTC

నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో పరిధిలోని మహిళలకు టికెట్ జారీ చేసిన ఘటనపై టీఎస్ ఆర్టీసీ ఎండీ  సజ్జనార్ విచారణకు ఆదేశించారు. ఎండీ సజ్జనార్ ఆదేశాలతో కండక్టరును డిపో స్పేర్ లో ఉంచి పూర్తిస్థాయిలో ఆర్టీసీ అధికారులు విచారణ జరిపారు. ఈ విచారణలో కండక్టర్ ఉద్దేశ్యపూర్వంగా టికెట్ జారీ చేయలేదని తేలింది. 

నిజామాబాద్‌ నుంచి బోధన్‌ వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో నిజామాబాద్‌ టౌన్‌ బస్టాండ్‌ వద్ద ఆదివారం ముగ్గురు ఎక్కారు. అందులో ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు. పురుష ప్రయాణికుడు ముగ్గురికి బోధన్‌కు టికెట్‌ ఇవ్వమని కండక్టర్‌ను అడిగారు. రూ.30 చొప్పున ముగ్గురికి రూ.90 టికెట్‌ ను కండక్టర్‌ జారీ చేశారు. నిజామాబాద్ టౌన్ దాటిన తర్వాత  పురుష ప్రయాణికుడు కండక్టర్‌ వద్దకు వచ్చి.. మహిళలకు ఉచితం కదా.. టికెట్‌ ఎందుకు జారీ చేశారని ప్రశ్నించారు. ముగ్గురు పురుషులే అనుకుని టికెట్‌ ను జారీ చేశారని, అన్యత భావించవద్దని కండక్టర్‌ సమాధానం ఇచ్చారు. వెంటనే ఆ టికెట్‌ ను వెనక్కి తీసుకుని పూర్తి డబ్బును తిరిగి ఇచ్చారు. 

అయితే మహిళలకు ఆర్టీసీ బస్సుల డబ్బులు తీసుకొని టికెట్ జారీ చేశారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పెద్ద దుమారమే రేగింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందిస్తూ విచారణ చేపడతామని ట్వీట్ చేశారు. కండక్టర్ ను డిపో స్పేర్ చేసి విచారణ జరిపారు. విచారణలో కండక్టర్ ఉద్దేశ్యపూర్వకంగా టికెట్ జారీ చేయలేదని తేలింది. 

ఈ ఘటనపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యం  ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ సౌకర్యంపై క్షేత్రస్థాయి సిబ్బంది  అందిరికీ ఇప్పటికే అవగాహన కల్పించామన్నారు. క్షేత్రస్థాయిలో ఇలాంటి ఘటనలు పునరావృతంగ కాకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు సజ్జనార్. ఈ పథకం సజావుగా అమలు అయ్యేందుకు ప్రజదందరూ సహకరించాలని సంస్థ కోరుతోందని టీఎస్ ఆర్టీస్ ఎండీ సజ్జనార్ తెలిపారు.