జులై ఫస్ట్ వీక్లో బీటెక్ కౌన్సెలింగ్.. ఆగస్టులో ఫస్టియర్ క్లాసులు ప్రారంభం

జులై ఫస్ట్ వీక్లో బీటెక్ కౌన్సెలింగ్.. ఆగస్టులో ఫస్టియర్ క్లాసులు ప్రారంభం
  • జోసా తరహాలో మాక్ కౌన్సెలింగ్ నిర్వహిస్తం
  • టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి వెల్లడి
  • నెక్స్ట్ వేవ్, బైట్ ఎక్సెల్, లీప్ స్టార్ట్, ఇంటెల్లిపాత్ విద్యా సంస్థల్లో చేరొద్దని స్టూడెంట్లకు సూచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీటెక్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియను జులై మొదటి వారంలో ప్రారంభించనున్నట్టు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈ ప్రక్రియను ఆగస్టు 14లోపు పూర్తి చేసి, ఫస్టియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విద్యార్థులకు క్లాసులు ప్రారంభిస్తామని చెప్పారు. త్వరలోనే కేరీర్ గైడెన్స్ కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నామని ఆయన స్పష్టం చేశారు.

మంగళవారం మాసబ్ ట్యాంక్​లోని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ) ఆఫీసులో కౌన్సిల్ వైస్ చైర్మన్లు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్​కే మహమూద్, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జేఈఈ షెడ్యూల్​కు అనుగుణంగా ఎప్​సెట్ అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందన్నారు. విద్యార్థుల్లో సీట్ల అలాట్ మెంట్ పై అవగాహన కోసం ఈ ఏడాది జోసా కౌన్సెలింగ్ తరహాలో ఎప్ సెట్ మాక్ అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. దీని ద్వారా విద్యార్థులకు ఏఏ కాలేజీలో సీట్లు వచ్చే అవకాశం ఉంటుందనేది తెలుసుకునే చాన్స్ ఉంటుందన్నారు. ఇంజినీరింగ్ అంటే కేవలం సీఎస్​ఈ మాత్రమే కాదని, త్వరలోనే దీనికి డిమాండ్ తగ్గే ప్రమాదం ఉందన్నారు. 

విద్యార్థులు కోర్ ఇంజినీరింగ్ గ్రూపులనూ ఎంపిక చేసుకోవాలని, వాటికి మంచి ఉద్యోగ అవకాశాలున్నాయని చెప్పారు. కౌన్సెలింగ్, కోర్సులు, కేరీర్ పై అవగాహన కోసం ఈ నెల మూడో వారంలో జేఎన్టీయూలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇంజినీరింగ్ ఫీజులపై, బీ కేటగిరి సీట్లపై ఇంకా స్పష్టత రాలేదని, ముందుగా ఎవ్వరూ కాలేజీల్లో చేరొద్దని సూచించారు. ఉన్నత విద్యాశాఖలో పలు సంస్కరణల కోసం హైయ్యర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ బిల్ తీసుకురావాలని తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామని, త్వరలోనే ఈ అంశంపై సీఎను కలిసి వివరించనున్నట్టు చెప్పారు. కోచింగ్ సెంటర్ల సమాచారాన్ని సేకరిస్తున్నామని, త్వరలోనే వాటిపై మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు వెల్లడించారు. ఈ ఏడాది డిగ్రీ ఫస్టియర్ లో సిలబస్ మారుతుందని తెలిపారు. 

నెక్స్ట్ వేవ్, బైట్ ఎక్సెల్, లీప్ స్టార్ట్, ఇంటెల్లిపాత్ విద్యాసంస్థల్లో చేరొద్దని స్టూడెంట్లకు సూచన
హైదరాబాద్  ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లోని నెక్ట్స్ వేవ్, మాదాపూర్లోని బైట్ ఎక్స్ఎల్ టెక్ ఎడ్ ప్రైవేట్ లిమిటెడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని లీప్ స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, హైటెక్ సిటీలోని ఇంటిల్లిపాత్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ సంస్థలకు టీజీసీహెచ్ఈ నోటీసులు జారీచేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా అడ్మిషన్లు, క్లాసులు ఎలా నిర్వహిస్తున్నారో చెప్పాలని, ఈ నెల 13లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించామని బాలకిష్టారెడ్డి స్పష్టం చేశారు.

కొన్ని ప్రైవేటు డీమ్డ్ వర్సిటీలతో టై అప్ అయి.. ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు ఇస్తామని స్టూడెంట్ల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నట్టు టీజీసీహెచ్ఈ కి కొందరు పేరెంట్స్ ఫిర్యాదు చేశారు.  దీంతో ఆ సంస్థలకు నోటీసులు జారీ చేశామన్నారు. వారి నుంచి వివరణ తీసుకున్న తర్వాత ఆయా విద్యాసంస్థలపై చర్యలు ఉంటాయని చెప్పారు. విద్యార్థులు ఇలాంటి గుర్తింపు లేని, బోగస్ విద్యాసంస్థల్లో చేరొద్దని సూచించారు.