
- లాభపడనున్న నెస్లే, ఐటీసీ, బ్రిటానియా, డాబర్, హెచ్యూఎల్
- పండుగ సీజన్ ముందే అమల్లోకి రావాలని కోరుతున్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు
- జ్యూస్, జామ్, స్వీట్లపై జీఎస్టీ పెరిగే ఛాన్స్
- డాబర్ సేల్స్లో 15% జ్యూస్ల నుంచే వస్తోంది
- సిన్ గూడ్స్పై 40% జీఎస్టీ.. ఐటీసీ, వరుణ్ బెవరేజెస్కు ఇబ్బంది
- జీఎస్టీ తగ్గించడంతో వినియోగం పెంచాలని చూస్తున్న కేంద్రం
న్యూఢిల్లీ: నూడుల్స్, బిస్కెట్లు, ఆయుర్వేద ఉత్పత్తులు, ఫ్రోజన్ ఫుడ్స్ వంటి రోజువారీ వాడే అనేక వస్తువుల ధరలు దిగిరానున్నాయి. ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలు అమలైతే, 12శాతం, 28శాతం స్లాబ్ రేట్లు తొలగిపోతాయి. కేవలం 5శాతం, 18శాతం స్లాబ్లు మాత్రమే ఉంటాయి.
ముఖ్యమైన ఎఫ్ఎంసీజీ వస్తువులతో సహా రోజువారీ వాడే 90శాతం వస్తువులు 5శాతం స్లాబ్కి మారే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. దీని వల్ల ధరలు తగ్గి, డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. నెస్లే, ఐటీసీ, బ్రిటానియా, డాబర్, హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) వంటి సంస్థల అమ్మకాలు రానున్న పండుగ సీజన్లో పెరగొచ్చు.
ఈ కంపెనీలకు లాభం
ఫైనాన్షియల్ కంపెనీ జెఫరీస్ ప్రకారం, ప్యాకేజ్డ్ ఫుడ్, ఆయుర్వేద, పర్సనల్ కేర్ ఉత్పత్తుల ధరలు ఎక్కువగా తగ్గే అవకాశం ఉంది. కండెన్స్డ్ మిల్క్, డ్రై ఫ్రూట్స్, ఫ్రోజన్ వెజిటబుల్స్, పెన్సిల్స్, టూత్ పౌడర్ వంటి వాటిపై జీఎస్టీ12శాతం నుంచి 5శాతానికి తగ్గవచ్చు. ప్రాసెస్డ్ ఫుడ్స్, డెయిరీ ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గితే డాబర్, ఇమామీ వంటి ఆయుర్వేద కంపెనీలు ఎక్కువగా లాభపడతాయి. ప్రస్తుతం ఎఫ్ఎంసీజీ సెక్టార్లో డిమాండ్ తగ్గింది.
ఈ టైమ్లో జీఎస్టీ సంస్కరణలు తీసుకురావడంతో వినియోగం ఊపందుకుంటుందని అంచనా. ప్రజలపై పన్ను భారం తగ్గడంతో ఎక్కువగా కొంటారని ఎనలిస్టులు భావిస్తున్నారు. బిస్కెట్లు, హెయిర్ ఆయిల్స్, టూత్పేస్ట్లపై జీఎస్టీ 18శాతం స్లాబ్లోనే కొనసాగే అవకాశం ఉంది. వీటిపై జీఎస్టీ తగ్గితే హోం, పర్సనల్ కేర్ కంపెనీలకు లాభం చేకూరుతుంది.
వీటి ధరలు పైకి
జామ్స్, చక్కెరతో చేసిన స్వీట్లు వంటి కొన్ని ఉత్పత్తులు 12శాతం నుంచి 18శాతం స్లాబ్కి మారే అవకాశం ఉంది. డాబర్కి 15శాతం అమ్మకాలు జ్యూస్ల ద్వారా వస్తుండటంతో ఈ కంపెనీపై కొంత ఒత్తిడి ఉండొచ్చు. ఐటీసీ, హెచ్యూఎల్పై ప్రభావం తక్కువగా ఉంటుంది. ‘‘పండుగ సీజన్ ప్రారంభమయ్యే సెప్టెంబర్ మధ్యలో జీఎస్టీ మార్పులు అమలవ్వాలి. అప్పుడే సేల్స్ ఊపందుకుంటాయి”అని ఎఫ్ఎంసీజీ కంపెనీలు చెబుతున్నాయి.
సిగరెట్లు, కూల్డ్రింక్స్ మరింత కాస్ట్లీ
తంబాకు, సిగరెట్లు, ఆల్కహాల్, కార్బొనేటెడ్ డ్రింక్స్ వంటి సిన్ గూడ్స్పై 40శాతం జీఎస్టీ పడనుంది. సపరేట్గా సెస్ వేయకపోతే ఐటీసీ, వరుణ్ బెవరేజస్ వంటి కంపెనీలపై ప్రభావం తక్కువగా ఉంటుందని జెఫరీస్ అంచనా వేసింది. రేటింగ్ ఏజెన్సీ నోమురా ప్రకారం, స్నాక్స్, పాప్కార్న్ 12శాతం స్లాబ్ నుంచి 5 శాతానికి మారే అవకాశం ఉంది. నెస్లే ఇండియాకి చెందిన నూడుల్స్, పాస్తా, కండెన్స్డ్ మిల్క్ అమ్మకాలు, ఐటీసీకి చెందిన స్నాక్స్ అమ్మకాలు పెరగొచ్చు.
బ్రిటానియా బటర్, చీజ్ సేల్స్ కూడా ఊపందుకుంటున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. డాబర్కి ఆయుర్వేద ప్రొడక్ట్ల ద్వారా లాభం ఉంటుందని తెలిపారు. హిందుస్తాన్ యూనిలీవర్ సాస్, మయొనీస్ సేల్స్ ద్వారా కొంత లాభపడే అవకాశం ఉంది. ఫుడ్ కాకుండా స్టేషనరీ, పేపర్ ప్రొడక్ట్లు, లెన్స్లు, ఫ్రేమ్లు, రూ.వెయ్యి లోపు ధర ఉన్న చెప్పులు, షూస్ వంటి వాటిపై కూడా జీఎస్టీ దిగిరావొచ్చు. అదే జరిగితే ఐటీసీ ఎక్కువగా లాభపడుతుంది. ఈ కంపెనీకి 11 శాతం రెవెన్యూ నోట్బుక్లు, స్టేషనరీ అమ్మకాల ద్వారా వస్తోంది.