విశాల్, సునయన జంటగా ఏ.వినోద్ కుమార్ దర్శకత్వంలో రమణ, నంద నిర్మిస్తున్న చిత్రం ‘లాఠీ’. ప్యాన్ ఇండియా మూవీగా డిసెంబర్ 22న విడుదల కానుంది. సోమవారం రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ‘ఇక్కడ జరగబోయేది తెల్లారితే మర్చిపోయేలా ఉండకూడదు. ఎన్నో ఏళ్లు, ఎంతోమంది దీని గురించి మాట్లాడుకుంటూనే ఉండాలి’ అనే డైలాగ్తో స్టార్టయిన ట్రైలర్ కంప్లీట్ యాక్షన్ మోడ్లో ఉంది.
పోలీస్ కానిస్టేబుల్, లాఠీ స్పెషలిస్ట్గా విశాల్ ఇంప్రెస్ చేస్తున్నాడు. సునయనకు భర్తగా, ఓ బిడ్డకు తండ్రిగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఒంటినిండా గాయాలున్నా, విలన్స్ను కొడుతూ కనిపించాడు. ‘మీలాంటి వాళ్లను చేతికి లాఠీ ఇచ్చి కొట్టమంటే, అది మాకు పై అధికారి ఇచ్చే ఆర్డర్ కాదురా, ఆఫర్’ అనే పవర్ఫుల్ డైలాగ్స్తో మెస్మరైజ్ చేస్తున్నాడు. ప్రభు కీలక పాత్ర పోషించాడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.