- ఇదీ పలువురు ప్రజాప్రతినిధుల తీరు
- బినామీల పేరుతో కాంట్రాక్ట్ సంస్థలు
- నియోజకవర్గాల్లో పెద్దపెద్ద పనులన్నీ వాళ్లయే
- క్వాలిటీ లేకుంటే అడగలేకపోతున్న ఆఫీసర్లు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: ఒకప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలంటే ప్రజా సేవకే పరిమితమయ్యేవాళ్లు. ఇప్పుడు చాలామంది డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారు. భార్యా, పిల్లలు, బంధువులు, అనుచరుల పేర్లతో కన్స్ట్రక్షన్ కంపెనీలు తెరిచి రోడ్లు, బిల్డింగులు సహా మెజారిటీ పనులన్నీ చేస్తున్నారు. నియోజకవర్గాల్లో గవర్నమెంట్ వర్క్స్ టెండర్లయితే పక్కాగా వీరికే వస్తున్నాయి. ఆన్లైన్ టెండర్లు కూడా వదలడం లేదు. ఒకవేళ వేరే ఎవరికైనా వస్తే వారికి బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారు. పోనీ, పనులేమన్నా సరిగ్గా చేస్తున్నారా అంటే అదీ లేదు. కొన్నిచోట్ల వర్క్స్ చేయకుండా, మరికొన్ని చోట్ల మధ్యలోనే ఆపేసి ఆఫీసర్లను బెదిరించి బిల్లులు తీసుకుంటున్నారు. ఎవరైనా వినకపోతే ట్రాన్స్ఫర్ చేయిస్తున్నారు. దీంతో తమకు ఎందుకు వచ్చిన గొడవ అనుకుని ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పినట్టే చేస్తున్నారు.
ఇసుక, సిమెంట్, స్టీల్ షాపులు వీళ్లవే..
ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇసుక, సిమెంట్, స్టీల్ ప్రధానం. దీంతో చాలా నియోజకవర్గల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ బంధువులు, కుటుంబసభ్యుల పేర్లతో ఇసుక బిజినెస్ చేస్తున్నారు. సిమెంట్, స్టీల్ అమ్మే షాపులు నడిపిస్తున్నారు. లారీలు కొని ఎక్కడికి అవసరమైతే అక్కడికి ఇసుక సప్లయ్ చేస్తున్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఎవరైనా వర్క్స్ చేయాల్సి వస్తే తమ దుకాణాల్లోనే సిమెంట్, స్టీల్, ఇతర సామాన్లు కొనాలని ఆర్డర్ వేస్తున్నారు. ఒకవేళ వేరే షాపుల్లో కొన్నారా.. వాళ్ల బిల్లులు ఆగినట్టే. హనుమకొండ జిల్లా మాందారిపేటలో ఏర్పాటు చేసిన డాంబర్ ప్లాంట్ ఓ ఎమ్మెల్యే భార్య పేరుపై ఉంది. ఇదేకాక ములుగు జిల్లా ఏటూరునాగారంలో కూడా మరో ప్లాంట్ ఉంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా రోడ్డు పనులు జరిగితే వీరి స్టోన్ క్రషర్ నుంచి మెటీరియల్, డాంబర్ ప్లాంట్ నుంచి బీటీ తీసుకోవాల్సిందే. ఈ జిల్లాలో దాదాపు రోడ్లతో సహా పనులన్నీ స్థానిక ఎమ్మెల్యేలకు చెందిన కన్ స్ట్రక్షన్ కంపెనీలే చేస్తుండడంతో ఏడాది, రెండేండ్లకే గ్రామాల్లో వేసిన రోడ్లు దెబ్బతింటున్నాయి. అలాగే ఓ ఎమ్మెల్యే తన తమ్ముడి పేరుతో మాందారిపేటలో ‘రోబోసాండ్ ’ బిజినెస్ చేయిస్తున్నారు. నియోజకవర్గంలో జరిగే రోడ్డు పనులన్నీ ఈయనే చేస్తారు.
రూ.120 కోట్ల రోడ్డు..అడిగేదెవరు?
రాష్ట్రంలో ప్రతీ యేటా నేషనల్ హైవేస్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఈజీఎస్ సీసీ రోడ్ల నిర్మాణాలు జరుగుతుంటాయి. ఈ పనులను ఎక్కువగా అధికార పార్టీ ఎంపీలకు చెందిన కన్ స్ట్రక్షన్ కంపెనీలే చేస్తున్నాయి. ప్రతీ డిపార్ట్మెంట్లో స్టేట్ గవర్నమెంట్కు చెందిన హయ్యర్ అఫీషియల్స్..ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులకు చెందిన కన్ స్ట్రక్షన్ కంపెనీలకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అధికార పార్టీలోని ఓ ఎంపీకి చెందిన కన్స్ట్రక్షన్కంపెనీ వరంగల్ జిల్లా ఆత్మకూరు నుంచి భూపాలపల్లి జిల్లా చెల్పూరు వరకు రూ.120 కోట్లతో 353 సీ నేషనల్ హైవే రోడ్డు వర్క్స్ చేసింది. కానీ, పనులు మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. పనులు చేసే టైంలోనే రోడ్డు చాలాచోట్ల దెబ్బతింది. ఇప్పటికే ఈ రోడ్డుపై యాక్సిడెంట్స్జరిగి 20 మందికి పైగా చనిపోయారు. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో టోల్ ఏర్పాటు చేస్తే వాహనదారులు తిడతారని నేషనల్ హైవేస్ ఆఫీసర్లు రెండేండ్లుగా టోల్ గేట్ కూడా ఏర్పాటు చేయలేదు. నిజానికి రాష్ట్ర సర్కారు ఈ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. దెబ్బతిన్న ప్రతి చొటా ఆ కంపెనీతోనే రిపేర్లు చేయించాలి. కానీ ఇవేమి జరగడం లేదు.
- ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి తన సన్నిహితుడి పేరుతో కన్స్ట్రక్షన్ కంపెనీ నడుపుతున్నారు. జిల్లాలో దాదాపు అన్ని పనులు ఇదే కంపెనీకి అప్పజెబుతున్నారు. ప్రస్తుతం ఈ కాంట్రాక్ట్ సంస్థ ఓ మెడికల్ కాలేజీ, 2 మినీ ట్యాంక్ బండ్ లు, చెక్ డ్యాములతో పాటు దాదాపు రూ. 1,200 కోట్ల పనులు చేస్తున్నది.
- ఉమ్మడి మహ బూబ్నగర్ జిల్లాలో ఓ ఎమ్మెల్యేకు ఓ రిజర్వాయర్ పనుల్లో షేర్ ఉందని ఆరోపణలున్నాయి. ఆయన భార్య డైరెక్టర్ గా ఓ పైపుల కంపెనీ కూడా ఉంది. అలాగే మరో యువ ఎమ్మెల్యేకు కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. ఇంకో ఎమ్మెల్యేను పాలమూరు ఎత్తిపోతల స్కీమ్లో అండర్ కెనాల్ పనులు ఇస్తామనే అగ్రిమెంట్ తో పార్టీలోకి తీసుకున్నారని అంటున్నారు. ఓ నియోజకవర్గంలో చెక్ డ్యాం పనులన్నింటినీ ఎమ్మెల్యే బినామీ పేర్లతో చేయిస్తున్నాడు. కర్వెన రిజర్వాయర్ నిర్మాణంలోనూ సబ్ కాంట్రాక్ట్పనులు చేస్తున్నారు. ఈయనకు వందకు పైగా టిప్పర్లు, జేసీబీలు, టిప్పర్, ఇతర మెషీన్లున్నాయి. నియోజకవర్గంలో చేసే బ్రిడ్జీ నిర్మాణ పనులు, ఇతర పనులన్నీ ఈయన కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. గద్వాల జిల్లాలో ఓ ఎమ్మెల్యే బావమరిదికి స్టోన్క్రషర్ కంపెనీ ఉన్నది. జిల్లాలో కన్స్ట్రక్షన్ పనుల కోసం వీరి క్రషర్ నుంచే మెటీరియల్ సరఫరా అవుతోంది.
- భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు తమ అనుచరులకు కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తుంటారు. దీనికోసం కమిషన్ తీసుకుంటున్నారు. ఇదే జిల్లాలో మరో ఎమ్మెల్యే బినామీల పేర ఇసుక ర్యాంప్లు నిర్వహిస్తున్నారని ఆరోపణలున్నాయి.
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఓ మంత్రి, ఆయన భార్య ఓ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారు. ఖమ్మంలో బినామీ పేర్లతో గతేడాది కోట్లాది రూపాయల విలువైన సీసీ రోడ్లు, సెంట్రల్ డివైడర్ల నిర్మాణ పనులు ఈ కంపెనీయే దక్కించుకుంది.