IPO News: నిండా ముంచిన ఐపీవో.. నష్టాల లిస్టింగ్, మీరూ ఇన్వెస్ట్ చేశారా?

IPO News: నిండా ముంచిన ఐపీవో.. నష్టాల లిస్టింగ్, మీరూ ఇన్వెస్ట్ చేశారా?

Leela Hotels IPO: కొత్త నెల దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లోనే తమ ట్రేడింగ్ ప్రయాణాన్ని మెుదలుపెట్టాయి. ఈ క్రమంలో చాలా కాలం తర్వాత తిరిగి స్టార్ట్ అయిన ఐపీవోల కోలాహలం కూడా అంత సానుకూలంగా లేదు. నేడు మార్కెట్లో జాబితా అయిన ఐపీవో ఇన్వెస్టర్లను పూర్తిగా నిరాశకు గురిచేసింది.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది స్క్లాస్ బెంగళూరు లిమిటెడ్ (లీలా హోటల్స్) కంపెనీ ఐపీవో గురించే. వాస్తవానికి నేడు కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లలోకి అరంగేట్రం చేశాయి. అయితే లీలా హోటల్స్ షేర్లు ఇష్యూ ధర కంటే 7 శాతం తక్కువ ధరకు జాబితా కావటంతో బెట్ వేసిన ఇన్వెస్టర్లకు నష్టాలు మిగిలాయి. మెయిన్ కేటగిరీలో వచ్చిన కంపెనీ షేర్లు ఒక్కోటి ఎన్ఎస్ఈలో 6.67 శాతం డిస్కౌంట్ రేటు రూ.406 వద్ద జాబితా కాగా.. బీఎస్ఈలో కంపెనీ షేర్లు 6.55 శాతం తక్కువగా రూ.406.50 వద్ద ట్రేడింగ్ మెుదలుపెట్టాయి. 

కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.3వేల 500 కోట్లను సమీకరించింది. ఇందులో రూ.2వేల 500 కోట్ల కోసం 5కోట్ల 75 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయగా.. మిగిలిన రూ.వెయ్యి కోట్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయించటానికి 2కోట్ల 30 లక్షల ప్రమోటర్ వాటాల విక్రయం జరిగింది. వాస్తవానికి ఐపీవో మే 26 నుంచి మే 28 వరకు రిటైల్ పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంచబడింది. ఈ క్రమంలో స్టాక్ ధర ప్రైస్ బ్యాండ్ ధరను రూ.413 నుంచి రూ.435గా ప్రకటించింది. 

ఇన్వెస్టర్ల కోసం లాట్ పరిమాణాన్ని కంపెనీ 34 షేర్లుగా నిర్ణయించటంతో రిటైల్ పెట్టుబడిదారులు కనీసం ఒక లాట్ కొనుగోలు కోసం రూ.14వేల 790 పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. అలాగే కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.వెయ్యి 575 కోట్లను సమీకరించింది. కంపెనీ ప్రమోటర్లకు ఐపీవోకి ముందు కంపెనీలో 100 శాతం వాటాలు ఉండగా ప్రస్తుతం అది 75.91 శాతానికి తగ్గింది. లిస్టింగ్ ముందు గ్రేమార్కెట్లో కేవలం షేరుకు రూ.2 ప్రీమియం ధర మాత్రమే కలిగి ఉన్న కంపెనీ షేర్లు నేడు నష్టాలతో జాబితా అయ్యాయి.

కంపెనీ వ్యాపారం..
స్క్లాస్ బెంగళూరు లిమిటెడ్ కంపెనీ 2019లో స్థాపించబడింది. ఇది ది లీలా హోటల్స్ బ్రాండ్ పేరుతో ఆతిథ్య వ్యాపారంలో కొనసాగుతోంది. కంపెనీ లగ్జరీ హోటళ్లు, రిసార్టులను దేశవ్యాప్తంగా కలిగి ఉంది. ప్రస్తుతం కంపెనీ 12 హోటళ్లను నిర్వహిస్తూ దేశంలోని అతిపెద్ద లగ్జరీ హోటల్ చైన్ సంస్థల్లో ఒకటిగా గుర్తింపును సాధించింది. కంపెనీ బెంగళూరు, చెన్నై, దిల్లీ, జైపూర్, ఉదయ్ పూర్ ప్రాంతాల్లో హోటళ్లను నిర్వహిస్తోంది.