తిరుమల శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత కలకలం..

తిరుమల శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత కలకలం..

ఆదివారం ( జూన్ 1 ) తిరుమల శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది... శ్రీవారిమెట్టు మార్గంలోని 500వ మెట్టు దగ్గర పొదల్లో సేదతీరుతూ కనిపించింది చిరుత. దీంతో నడకమార్గంలో వెళుతున్న భక్తులు భయబ్రాంతులకు లోనయ్యారు. చిరుత సంచారం గురించి సెక్యూరిటీకి సమాచారం అందించారు భక్తులు. ఘటనాస్థలికి చేరుకున్న సెక్యూరిటీ సిబ్బంది సైరన్ మోతతో చిరుతను తరిమేశారు. శ్రీవారిమెట్టు సెక్యూరిటీ చెక్ పాయింట్ దగ్గర అరగంట పాటు భక్తులను నిలిపేశారు అధికారులు.

అరగంట శ్రమించిన సెక్యూరిటీ సిబ్బంది సైరన్ మోతతో చిరుతను తరిమేసారు. అనంతరం భక్తులను బృందాలుగా పంపుతున్నారు అధికారులు. వేసవి సెలవులు ముగిసే సమయం దగ్గర పడటంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో నడకమార్గంలో వెళ్లే భక్తుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. చిరుత సంచారంతో ఉలిక్కిపడ్డారు భక్తులు.గతవారంలో కూడా అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది.. అలిపిరి నడకదారి, మొదటి, రెండవ ఘాట్ రోడ్లలో తరచూ చిరుతలు కలకలం రేపింది. గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో  టిటిడి అప్రమత్తమైంది. దీంతో నివారణ చర్యలపై తిరుమలలో టీటీడీ ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు.

టీటీడీ ఈవో శ్యామలరావు వర్చువల్‌గా పాల్గొనగా, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, టిటిడి ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో టీటీడీ అటవీ శాఖ, అటవీ శాఖ, వివిధ విభాగాల అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సుధీర్ఘంగా చర్చించారు. వెంటనే తీసుకోవాల్సిన తాత్కాలిక జాగ్రత్తలతో పాటు, దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. అలాగే నడక మార్గంలో చెత్తను ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖ ద్వారా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. టీటీడీ అటవీ శాఖ, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆరోగ్య, విజిలెన్స్ శాఖలతో కలిసి అటవీ శాఖ సమన్వయంతో నడక మార్గంపై నిరంతర జాయింట్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే మానవ వన్యప్రాణి ఘర్షణను నివారించేందుకు అటవీశాఖ, వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూ్ట్ ఆఫ్ ఇండియా సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.