హైదరాబాద్లో చిరుత కలకలం.. రోడ్డు దాటుతుండగా సీసీ కెమెరాలో రికార్డ్.. ఆ ఏరియా వాళ్లు జాగ్రత్త !

హైదరాబాద్లో చిరుత కలకలం.. రోడ్డు దాటుతుండగా సీసీ కెమెరాలో రికార్డ్.. ఆ ఏరియా వాళ్లు జాగ్రత్త !

హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. గత కొన్నాళ్లుగా హైదరాబాద్ ఔట్ స్కట్స్ లో సంచరిస్తున్న చిరుత పులి.. ఉన్నట్లుండి నగరంలో ప్రత్యక్షం కావడం నగరవాసులను భయాందోళనలకు గురిచేస్తోంది. సోమవారం (జులై 28) తెల్లవారుజామున.. మిలిటరీ ప్రాంతంలో రోడ్డు దాటుతూ కనిపించడం కలకలం రేపింది.

గోల్కొండ ఇబ్రహీంబాగ్ మిలటరీ ప్రాంతంలో రోడ్డు దాటుతూ చిరుత కనిపించింది. చిరుత రోడ్డు దాటుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తారామతి వెనకవైపు ఉన్న మూసి వైపు వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. చిరుత పులిని సీసీటీవీలో చూసిన గోల్కొండ పోలీసులు ఫారెస్ట్ అధికారులకు తెలియజేశారు. 

గోల్కొండ ఇబ్రహీం బాగ్ ఏరియాల్లో చిరుత సంచరిస్తుండటంతో అటుగా వెళ్లే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. రాత్రుల్లో ఒంటిరిగా వెళ్లేవాళ్లు, బైకులపై వెళ్లే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

గత నాలుగైదు రోజులుగా చిరుత హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో సంచరిస్తోంది. జులై 23 (బుధవారం) రాత్రి నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో కనిపించింది. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల EIPL రివర్ ఎడ్జ్ విల్లాస్ పక్కన కొండపై చిరుత కనపడింది. ఈ ఘటన కలకలం రేపింది. 51 విల్లాస్ యజమాని తన ఇంటిపై నుంచి సెల్ ఫోన్తో చిరుత పులిని ఫోటో తీశాడు. చిరుత సంచారంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. ఖరీదైన విల్లాలకు కేరాఫ్గా ఉన్న ప్రాంతాల్లో మంచిరేవుల ఒకటి.


గండిపేట్, కిస్మత్ పురా, మోకీలా, తెల్లాపూర్, మంచిరేవుల, కోకాపేట్, నెక్నాంపూర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సమీప ప్రాంతాల్లో ఖరీదైన విల్లాలు కొనేందుకు నగరంలోని ధనవంతులు ఆసక్తి చూపుతున్నారు. సిటీలో రణగొణ ధ్వనులకు దూరంగా.. ప్రశాంతంగా ఉంటుందని మంచిరేవుల ఏరియాలో విల్లాలు కొనుక్కుని ఉంటుంటే.. చిరుత పులి సంచారం స్థానికులలో భయాందోళన రేకెత్తించింది.

నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవుల విలేజ్ వ్యాస్ నగర్‌ క్యాంపస్‌లో కూడా చిరుత జాడను ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు చిరుత జాడ చిక్కింది. గత కొన్ని రోజులుగా చిరుత ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం ఉందని అధికారులు ధృవీకరించారు. ఒక వ్యక్తి ఈ ప్రాంతంలో చిరుతను చూసినట్లు తెలపడంతో అధికారులు ఈ ప్రాంతంలో రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుత జాడ కోసం వేచి చూశారు.

ఎట్టకేలకు గురువారం ఉదయం 7.40 గంటల ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు చిరుత జాడ చిక్కింది. రోడ్డు దాటుతూ చిరుత వెళ్లిన ఆనవాళ్లను గుర్తించారు. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమైయ్యారు. నాలుగు బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు మరో ఏడు సీసీ కెమెరాలను కూడా  ఏర్పాటు చేశారు. చిరుతను పట్టుకునేందుకు బోనుల్లో మేక పిల్లలను ఎరగా పెట్టారు. అయితే ఇప్పుడు గోల్కొండ మిలిటరీ ఏరియాలో కనిపించడం కలకలం సృష్టిస్తోంది.