అయోమయంలో 6,7 తరగతి స్టూడెంట్లు
పాఠాలు వినలేకపోతున్న పల్లె ప్రాంతాల్లోని విద్యార్థులు
ఆదిలాబాద్, వెలుగు: యాదగిరి చానల్లో 6, 7 తరగతుల పాఠాలు రాకపోవడంతో పల్లె ప్రాంతాల్లోని స్టూడెంట్లు లెసన్స్ వినలేకపోతున్నారు. ఆ తరగతుల పాఠాలు కేవలం టీశాట్లోనే ప్రసారం చేయడంతో వేలాది మంది లెసన్స్కు దూరమవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4.75 లక్షల మంది స్టూడెంట్లు ఉండగా అందులో ఆరు, ఏడు తరగతులు చదివేవారు 72 వేల మంది ఉన్నారు. వీరిలో రూరల్ ప్రాంతాల్లో 70 శాతం స్టూడెంట్లు ఉన్నారు. చాలామందికి టీశాట్ చానల్ రాక పాఠాలు వినలేకపోతున్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు క్లాసులను ఉదయం నుంచి సాయంత్రం వరకు యాదగిరి, టీశాట్ చానళ్లలో వచ్చేటట్టు ప్రోగ్రాం చేశారు. అందులో ఆరు, ఏడు తరగతుల లెసన్స్ మాత్రం టీశాట్లో వస్తున్నాయి. మిగతా తరగతుల క్లాసులన్నీ యాదగిరి చానల్లోనే వస్తున్నాయి. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగా ఫ్రీ డిష్ వాడుతున్నారు. అందులో యాదగిరి చానల్ మాత్రమే వస్తుంది. అవకాశం ఉన్నవారు వేరే వారి ఇళ్లకు వెళ్లి లెసన్స్ వింటున్నారు. అవకాశం లేని స్టూడెంట్లు లెసన్స్కు దూరమవుతున్నారు.
రికార్డు చేయించి టెలికాస్ట్ చేయిస్తాం
అన్నిచోట్ల లోకల్ చానళ్లు అందుబాటులో ఉన్నాయని, నిత్యం యాదగిరి, టీశాట్లో వచ్చే లెసన్స్ను రికార్డు చేయించి టెలికాస్ట్ చేయిస్తామని ఆదిలాబాద్ డీఈవో రవీందర్రెడ్డి చెప్పారు.
మా ఇంట్లో టీశాట్ రావడం లేదు
మా ఇంట్లో కేవలం డీడీ, యాదగిరి చానళ్లు మాత్రమే వస్తాయి. ఏడో తరగతి లెసన్స్ అన్నీ టీశాట్లోనే వస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు నేను ఒక్క క్లాసు కూడా వినలేదు. మా క్లాసులు కూడా యాదగిరి చానల్లోనే వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ‑ సుహాన, 7వ తరగతి, మన్నూర్.