- ప్రభుత్వ సెక్యూరిటీలు, కంపెనీల బాండ్లు, డిబెంచర్లలో కూడా
బిజినెస్ డెస్క్, వెలుగు: అతిపెద్ద డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ (డీఐఐ) అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) వచ్చే నెల ఒకటి నుంచి మార్కెట్లో భారీగా ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతోంది. డెట్, ఈక్విటీ మార్కెట్లలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.4 లక్షల కోట్లు పెడుతుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఎల్ఐసీ ఇంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం ఇదే మొదటిసారి అన్నారు. స్టాక్ మార్కెట్లకు సపోర్ట్గా నిలవడంతో పాటు, పాలసీ హోల్డర్లకు, కంపెనీ షేరు హోల్డర్లకు లాభాలు తెచ్చి పెడుతుందని అభిప్రాయపడ్డారు.
రూ.2.4 లక్షల కోట్లలో 35 శాతం అంటే రూ. 80,000 – 85,000 కోట్లను షేర్లలో ఎల్ఐసీ ఇన్వెస్ట్ చేస్తుందని వివరించారు. 50 శాతం ఫండ్స్ను ప్రభుత్వ సెక్యూరిటీలలో పెడుతుందని అన్నారు. యూఎస్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు వడ్డీ రేట్లను పెంచడంతో పాటు, చైనా మార్కెట్లు ఇండియా కన్నా చౌకగా ట్రేడవుతుండడంతో విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్ నుంచి వెళ్లిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారీగా ఇన్వెస్ట్ చేసేందుకు ఎల్ఐసీ ముందుకు వస్తుండడం మార్కెట్లకు సపోర్ట్గా నిలుస్తుంది. ‘గ్లోబల్ క్రైసిస్ వంటి చాలా సందర్భాల్లో మార్కెట్కు సపోర్ట్గా ఉన్నట్టే, ఈసారి కూడా ఎల్ఐసీ ఇన్వెస్ట్మెంట్లు మార్కెట్కు మద్ధతుగా ఉంటాయి’ అని ఎనలిస్టులు పేర్కొన్నారు.
వచ్చే 12 నెలల్లో నిఫ్టీ 18 వేలకు..
ఏప్రిల్ 1 తో మొదలుకానున్న ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ 18,000 మార్క్ను అందుకుంటుందని మెజార్టీ ఎనలిస్టులు భావిస్తున్నారు. హై ఇన్ఫ్లేషన్, రేట్ల పెంపు, బ్యాంకింగ్ క్రైసిస్, గ్లోబల్ రెసిషన్ వంటి సమస్యలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ 18,900 లెవెల్ వద్ద ఏడాది గరిష్టాన్ని, 15,800 వద్ద ఏడాది కనిష్టాన్ని రికార్డ్ చేసింది. ప్రస్తుతం 17,000 వద్ద ట్రేడవుతోంది. ఈటీమార్కెట్ సర్వే ప్రకారం, 15 ఎనలిస్టులలో 71 శాతం మంది కొత్త ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ బాగుంటుందని అభిఫ్రాయపడ్డారు. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి నిఫ్టీ 18,000 దగ్గరలో ఉంటుందని చెప్పారు.
ఇది ప్రస్తుత లెవెల్స్ నుంచి 6 శాతం ఎక్కువ. 21 శాతం మంది ఎనలిస్టులు కచ్చితంగా చెప్పలేమని అనగా, 7 శాతం మంది మాత్రం 17,000 దగ్గరే ఉంటుందని అన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ బాగుంటుందని 71 శాతం మంది పేర్కొనగా, మంచి పెర్ఫార్మెన్స్ చేయవని 21 శాతం మంది వెల్లడించారు. ఎఫ్ఐఐలు నికర కొనుగోలుదారులుగా మారతారని 57 శాతం మంది, చెప్పలేమని 29 శాతం మంది అన్నారు. కంపెనీల లాభాలు పడిపోతాయని 57 శాతం మంది, పడవని 43 శాతం మంది పేర్కొన్నారు.
ఈ కంపెనీల్లో వాటాలు పెంచుకుంటున్న ఎల్ఐసీ
షేర్లతో పాటు ప్రభుత్వ సెక్యూరిటీల (బాండ్లు, నోట్లు వంటివి) లో, డిపాజిట్ సర్టిఫికెట్లలో, కమర్షియల్ పేపర్లు, డిబెంచర్లలో కూడా ఎల్ఐసీ భారీగానే ఇన్వెస్ట్ చేయనుంది. ఇన్సూరెన్స్ రూల్స్ ప్రకారం, మిగులు నిధుల్లో కనీసం 50 శాతం ఫండ్స్ను ప్రభుత్వ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేయాలి. 20 శాతం అమౌంట్ను ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ సెక్యూరిటీలలో పెట్టాలి. మిగిలిన అమౌంట్ను ఇతర అసెట్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎల్ఐసీ దేశంలోని చాలా కంపెనీల్లో తన వాటాలను పెంచుకుంటోంది. డిసెంబర్, 2022 తో ముగిసిన క్వార్టర్ నాటికి, ఐఆర్సీటీసీ లో తన వాటాను 7.42 శాతానికి పెంచుకుంది.
సెప్టెంబర్ క్వార్టర్ నాటికి ఇది 4.44 శాతంగా ఉంది. వోల్టాస్లో తన వాటాను 8.24 శాతం నుంచి 9.88 శాతానికి పెంచుకుంది. ఎంఫాసిస్, టెక్ మహీంద్రా, కాప్రి గ్లోబల్ క్యాపిటల్, డా. రెడ్డీస్, వెల్స్పన్, దీపక్ నైట్రిట్, గెయిల్ , హెచ్డీఎఫ్సీ ఏఎంసీ వంటి కంపెనీల్లోనూ ఎల్ఐసీ తన వాటాలు పెంచుకుంది. ఐడీబీఐ బ్యాంక్ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, స్టాండర్డ్ బ్యాటరీస్, మొడెల్లా వుల్లెన్స్, కొచ్చిన్ మలబార్ ఎస్టేట్స్ ఎల్ఐసీ పోర్టుఫోలియోలో టాప్లో ఉన్నాయి.