ట్రయల్స్ పై జోక్యం చేసుకోబోమన్న ఢిల్లీ హైకోర్టు
సుప్రీంకోర్టుకు వెళ్తానంటున్న యంగ్ రెజ్లర్ అంటిమ్
న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్లో నేరుగా బరిలోకి దిగేందుకు ఇండియా స్టార్ రెజ్లర్లు బజ్రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్కు లైన్ క్లియర్ అయింది. ఇద్దరికీ ట్రయల్స్ నుంచి మినహాయింపు ఇచ్చిన విషయంలో జోక్యం చేసుకోబోమని ఢిల్లీ హైకోర్టు శనివారం తీర్పునిచ్చింది. ఐఓఏ అడ్హక్ కమిటీ బజ్రంగ్, వినేశ్కు మినహాయింపు ఇవ్వడంపై యంగ్ రెజ్లర్లు అంటిమ్ పంగల్, సుజీత్ కల్కర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ అనంతరం జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ ఈ పిటిషన్ను తిరస్కరించారు. దాంతో, మెన్స్ 65 కేజీ ఈవెంట్లో బజ్రంగ్, విమెన్స్ 53 కేజీ ల్లో ఫొగాట్ నేరుగా ఆసియాడ్కు వెళ్లనున్నారు.
ట్రయల్స్లో అంటిమ్ విక్టరీ
స్టార్లకు మినహాయింపు ఇవ్వడాన్ని ప్రశ్నించిన అంటిమ్ పంగల్ మ్యాట్పై తన సత్తా చూపెట్టింది. శనివారం జరిగిన 53 కేజీ ట్రయల్స్లో విజేతగా నిలిచింది. 19 ఏండ్ల అంటిమ్ ఫైనల్లో ప్రత్యర్థి మంజును పిన్డౌన్ చేసింది. ఆసియాడ్ జట్టులో స్టాండ్బై ప్లేయర్గా ఎంపికైంది. ట్రయల్స్లో గెలిచిన తనకే అవకాశం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్తానని అంటిమ్ చెప్పింది. ‘న్యాయంగా జరిగిన ట్రయల్స్లో గెలిచిన నేను స్టాండ్బై ప్లేయర్గా ఎందుకు ఉండాలి. పోటీ పడని వ్యక్తే స్టాండ్బైగా ఉండాలి. నా పిటిషన్ను హైకోర్టు కొట్టి వేసినా ఆగను. పోరాటం కొనసాగిస్తా. మేం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. వినేశ్ మంచి రెజ్లర్. ఎన్నో మెడల్స్ గెలిచిందని నాకు తెలుసు. కానీ, తను ట్రయల్స్లో మాతో పోరాడాల్సింది’ అని అంటిమ్ స్పష్టం చేసింది.