గోల్కొండ రోప్ వే కు లైన్ క్లియర్.. గోల్కొండ నుంచి కుతుబ్షాహి టూంబ్స్ వరకూ నిర్మాణం

గోల్కొండ రోప్ వే కు లైన్ క్లియర్.. గోల్కొండ  నుంచి కుతుబ్షాహి టూంబ్స్ వరకూ నిర్మాణం
  • పర్యాటకులను ఆకట్టుకునేలా హెచ్ఎండీఏ ప్రణాళిక
  • ఫీజుబిలిటీ టెండర్ దక్కించుకున్న  నైట్​ ఫ్రాంక్ సంస్థ
  • మూడు నుంచి  నాలుగు నెలల్లో నివేదిక

హైదరాబాద్​సిటీ, వెలుగు: నగరంలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో హెచ్ఎండీఏలోని ఉమ్టా అధికారులు గోల్కొండ వద్ద తలపెట్టిన రోప్​వే నిర్మాణానికి లైన్​క్లియర్ అయ్యింది. ప్రభుత్వం అనుమతించడంతో గోల్కొండ నుంచి కుతుబ్​షాహీ టూంబ్స్​ వరకూ 1.5 కి.మీ. రోడ్​వేను నిర్మించేందుకు హెచ్ఎండీఏ సిద్ధమైంది. 

దీనికి సంబంధించి ఫీజుబిలిటీ రిపోర్ట్​తయారు చేసేందుకు ఆయా కన్సల్టెన్సీ సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించగా, ప్రముఖ రియల్ ఎస్టేట్​ కన్సల్టెన్సీ సంస్థ నైట్​ఫ్రాంక్​ ఎంపికైంది. ఈ సంస్థ గోల్కొండ నుంచి కుతుబ్ షాహీ టూంబ్స్​ వరకూ ప్రాజెక్టు ఫీజుబిలిటీపై నివేదిక తయారు చేయనుంది. 

ముఖ్యంగా గోల్కొండ వద్ద రక్షణ శాఖకు చెందిన స్థలాలు ఉండడం వల్ల రైట్​ఆఫ్​వే నిర్మాణానికి అవసరమైన అధ్యయనంతో పాటు ప్రాజెక్టుకు అవసరమైన వివిధ వనరులను కూడా సమీకరిస్తుందని అధికారులు తెలిపారు. 

రోజూ వేలాది మంది సందర్శకులు

ముఖ్యంగా ప్రతి రోజూ వేలాది మంది గోల్కొండకు సందర్శకులు వస్తుంటారు. అలాగే దానికి సమీపంలోనే ఉన్న చారిత్రక కుతుబ్​షాహీటూంబ్స్​ను కూడా సందర్శిస్తుంటారు. అయితే గోల్కొండ నుంచి కుతుబ్​షాహీ టూంబ్స్​ వరకూ 1.5 కి.మీ. రహదారిలో ప్రతి రోజూ ట్రాఫిక్ ​జామ్​లు, ఇతర సమస్యలు అంటే సరైన రవాణా వ్యవస్థ అందుబాటులో లేక పోవడం వల్ల చాలా మంది టూరిస్టులు వెనుదిరిగి వెళ్తుంటారు. ఈ పరిస్ధితిని నివారించి నేరుగా రోప్​వే ద్వారానే గోల్కొండ నుంచి కుతుబ్​షాహి టూంబ్స్​ వరకూ ప్రయాణించేందుకు ఈ ప్రాజెక్టును చేప్టటాలని నిర్ణయించారు. 

రెండేండ్లలో ప్రాజెక్టు పూర్తి!

రోప్​వే ప్రాజెక్టుకు సంబంధించి ఫీజుబిలిటీ రిపోర్ట్​ను నైట్​ఫ్రాంక్​సంస్థ మూడు నుంచి నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. నివేదిక ఇవ్వగానే డీపీఆర్​ను తయారు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ప్రస్తుతం దేశంలోని ఉదయ్​పూర్, నలంద, డార్జిలింగ్, సిమ్లా, ముస్సోరి వంటి ప్రాంతాల్లో రోప్​వేలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎత్తయిన కొండలు, పర్వాతాలను కలుపుతూ వీటిని నిర్మించారు. కానీ గోల్కొండ – కుతుబ్​షాహీ టూంబ్స్​ తక్కువ ఎత్తులో నుంచే ప్రయాణించేలా అధికారులు ప్రాజెక్టును రూపొందించనున్నారు. 

ఈ ప్రాజెక్టు పూర్తయితే గోల్కొండ– కుతుబ్​షాహీ టూంబ్స్​ భారీ ఎత్తున టూరిస్టుల సంఖ్య పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్​ను పబ్లిక్​ ప్రైవేట్​ పార్టనర్​షిప్​ (పీపీపీ) పద్దతిలో నిర్మించనున్నారు. దీంతో హెచ్​ఎండీఏపై పెద్దగా ఆర్థిక భారం కూడా ఉండదని భావిస్తున్నారు.