త్రిగుణ్ హీరోగా వి.రఘుశాస్త్రి దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘లైన్ మ్యాన్’. పర్పల్ రాక్ ఎంటర్టైనర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం మార్చి 15న విడుదలవుతోంది. శనివారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకురాలు నందినీ రెడ్డి మాట్లాడుతూ ‘త్రిగుణ్ ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇలాంటి సినిమాను తీసిన దర్శక నిర్మాతలకు ఆల్ ది బెస్ట్’ అని చెప్పారు.
మరో గెస్ట్గా హాజరైన హీరో శివ కందుకూరి బిగ్ టికెట్ లాంచ్ చేసిన అనంతరం మాట్లాడుతూ ‘పోస్టర్లు చూస్తేనే సినిమా చాలా కొత్తగా ఉండబోతోందని అనిపించింది. ట్రైలర్ ఇంకా బాగుంది. మన మూలాల్లోకి వెళ్లి రాసుకునే కథలు, తీసే సినిమాలు ఆడియెన్స్కు ఎక్కువగా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంటాయి. త్రిగుణ్ కెరీర్లో ఈ చిత్రం పెద్ద హిట్గా నిలవాలి’ అని అన్నాడు. త్రిగుణ్ మాట్లాడుతూ ‘ఓ ఊర్లో పది రోజులు కరెంట్ లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా కథ. అందరూ కనెక్ట్ అవుతారు’ అని చెప్పాడు. ప్రతి ప్రాంతంలో జరిగిన కథలానే ఉంటుందని దర్శకుడు అన్నాడు. వర్దన్ పేట్ ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు, నిర్మాత యతీష్, వంశీ, గణేష్ పాపన్న, మైక్, రాజీవ్ చిత్రా కార్యక్రమంలో పాల్గొన్నారు.