
- పిళ్లై, బుచ్చిబాబు ద్వారాహైదరాబాద్లో కొన్న ఎమ్మెల్సీ కవిత
- రాజకీయ పలుకుబడితో తక్కువ రేట్కే దక్కించుకున్నరు
- సప్లిమెంటరీ చార్జ్షీట్లలో బయటపెట్టిన ఈడీ
- కవిత భర్త అనిల్ పేరు కూడా ప్రస్తావన
- చార్జ్షీట్లను పరిగణనలోకి తీసుకున్న కోర్టు
- ఈ నెల 10న విచారణ
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఈడీ సంచలన అభియోగాలు మోపింది. లిక్కర్ వ్యాపారంలో వచ్చిన లాభాలతో అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు ద్వారా హైదరాబాద్లో ఆమె భూములను కొన్నారని ఆరోపించింది. తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మార్కెట్ రేట్ కన్నా తక్కువ ధరకు ఆ భూములను కవిత దక్కించుకున్నారని ఈడీ పేర్కొంది. ముడుపుల చెల్లింపుల్లోనూ ఆమె కీలక పాత్ర పోషించారని తెలిపింది. కవిత భర్త అనిల్ పేరు కూడా తొలిసారి చార్జ్షీట్లో ప్రస్తావించింది.
అనిల్ పార్ట్నర్గా ఉన్న ఎన్గ్రోత్ క్యాపిటల్ సంస్థకు భూముల కొనుగోళ్లలో ప్రమేయం ఉందని వెల్లడించింది. 2021 ఏప్రిల్ లో కవిత, అరుణ్ రామచంద్ర పిళ్లై ఢిల్లీలోని ఒబెరాయ్ మైడెన్స్ హోటల్ లో ఆప్ నేత విజయ్ నాయర్ తో సమావేశమయ్యారని, చెల్లించాల్సిన ముడపులు, వాటిని రికవరీ చేయాల్సిన తీరుపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారని వివరించింది. లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవల రెండు, మూడు అనుబంధ చార్జ్షీట్లను ఢిల్లీలోని సీబీఐ స్పెషల్ కోర్టులో ఈడీ దాఖలు చేయగా.. ఇవి సోమవారం కోర్టు ముందుకు వచ్చాయి. వీటిని విచారణకు స్వీకరిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ వేదికగా జరిగిన లిక్కర్ స్కామ్ సమావేశాల్లో కవిత పాల్గొన్నట్లు ఆధారాలను కోర్టుకు ఈడీ అధికారులు అందజేశారు. లిక్కర్ స్కామ్లో సౌత్ గ్రూప్ పాత్ర, కవిత రోల్ ను 247 పేజీల థర్డ్ సప్లమెంటరీ చార్జ్షీట్ప్రత్యేకంగా పొందుపరిచారు. 763 పేజీల సెపరేట్ వ్యాల్యూమ్ ను కూడా కోర్టుకు సమర్పించారు. వాట్సాప్ చాట్స్ను కూడా అందజేశారు. కొత్తగా పలువురి పేర్లను ప్రస్తావించారు. వారికి స్కామ్ సూత్రధారులు, పాత్రధారులతో ఉన్న సంబంధాలను చార్జ్షీట్లలో ఈడీ వెల్లడించింది.
ఇండో స్పిరిట్ టు కవిత.. వయా పిళ్లై
హవాలా రూపంలో డబ్బు మళ్లింపులో అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి కీలకంగా వ్యవహరించారని, సౌత్ గ్రూప్ ను కనెక్ట్ చేయడంలో బుచ్చిబాబు రోల్ పోషించారని చార్జ్షీట్లలో ఈడీ వివరించింది. సౌత్ గ్రూప్, కల్వకుంట్ల కవిత తరఫున అరుణ్ పిళ్లై ఇండో స్పిరిట్లో భాగస్వామిగా ఉన్నట్లు పేర్కొంది. లిక్కర్ వ్యాపారంలో లాభాలు మొదట ఇండో స్పిరిట్ కు, అక్కడి నుంచి అరుణ్ పిళ్లై కి, తర్వాత ఆయన నుంచి కవితకు చేరేలా నిర్ణయం జరిగినట్లు వెల్లడించింది. గతేడాది ఇచ్చిన వాగ్మూలంలో ఈ అంశాలను అరుణ్ పిళ్లై ప్రస్తావించిన్నట్లు ఈడీ వివరించింది. నిరుడు ఏప్రిల్ లో కవిత, అరుణ్ పిళ్లై ఢిల్లీలోని ఒబెరాయ్ మైడెన్స్ హోటల్ లో ఆప్ నేత విజయ్ నాయర్ తో సమావేశమై చెల్లించాల్సిన లంచాలు, వాటిని రికవరీ చేయాల్సిన తీరుపై చర్చించారని పేర్కొంది. ఒబెరాయ్ హోటల్ రికార్డ్స్ ఆధారంగా ఈ విషయం ధృవీకరించినట్లు ఈడీ స్పష్టం చేసింది. అలాగే నిరుడు అక్టోబర్ 3న దినేశ్ అరోరా, అక్టోబర్ 2న, నవంబర్ 11న అరుణ్ పిళ్లై ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా ఇందుకు సరిపోతున్నాయని వివరించింది. కాగా, ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో ఇండో స్పిరిట్ కంపెనీ దాదాపు రూ. 192 కోట్లు లాభాలు ఆర్జించిందన్న ఈడీ పేర్కొంది. ఇండో స్పిరిట్ కంపెనీలో కవిత తరఫున అరుణ్ పిళ్లై ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు బుచ్చిబాబు కూడా స్టేట్మెంట్లో పేర్కొన్నాడని తెలిపింది. ఈ కంపెనీ నుంచి వచ్చే లాభాలకు కూడా కవిత తరఫున పిళ్లై ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు స్పష్టం చేసింది. రూ. 32.86 కోట్లను ఇండో స్పిరిట్ నుంచి పిళ్లై తీసుకున్నట్లు పేర్కొంది. అరుణ్ పిళ్లై ఆదేశాల మేరకే ఇండో స్పిరిట్ నుంచి బ్యాంక్ ట్రాన్జాక్షన్స్ జరిగాయని, ఇందులో పిళ్లై నేరుగా తన అకౌంట్ కు రూ. 25.5 కోట్లు మళ్లించుకున్నట్లు పేర్కొంది. అలాగే శరత్ చంద్రారెడ్డికి అరుణ్ పిళ్లై, సమీర్ మహేంద్రు నుంచి ఎక్సెస్ క్రెడిట్ నోట్స్ అందినట్లు వెల్లడించింది. అరుణ్ పిళ్లై రూ. 4.75 కోట్లు ఎం.గౌతమ్కు ట్రాన్స్ ఫర్ చేసినట్లు చార్జ్ షీట్ లో పేర్కొంది. ఇందులో రూ. 3.85 కోట్లు గౌతమ్ అకౌంట్ నుంచి అభిషేక్ బోయినపల్లి ఖాతాకు మళ్లినట్లు తెలిపింది. రూ. 1.70 కోట్లను ఇండియా అహేడ్ న్యూస్ చానల్లో నేరుగా అభిషేక్ బోయినపల్లి పెట్టుబడి పెట్టినట్లు ఈడీ వివరించింది.
ఈ నెల 10న విచారణ
ఈడీ దాఖలు చేసిన రెండు, మూడు అనుబంధ చార్జ్షీట్లను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సోమవారం సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి నాగ్ పాల్ తెలిపారు. వీటిపై ఈ నెల 10న విచారణ చేపడతామని వెల్లడించారు. ఈడీ అధికారులు ఏప్రిల్ 6, ఏప్రిల్ 28 ఈ రెండు చార్జ్షీట్లు దాఖలు చేశారు. ఈ చార్జ్ షీట్లపై విచారణ చేపట్టాలా? వద్దా అనే అంశం సోమవారం సీబీఐ స్పెషల్ కోర్టు ముందుకు రాగా.. కోర్టు విచారణకు ఓకే చెప్పింది. ఢిల్లీ, హైదరాబాద్లో జరిగిన సమావేశాలు, నిందితుల మధ్య జరిగిన వాట్సాప్ చాట్స్, సిగ్నల్ యాప్, కాల్ డేటా, ఈ మెయిల్స్, మొబైల్ ఫోన్స్ లో లభించిన సమాచారాన్ని చార్జ్ షీట్లలో ఈడీ అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా సౌత్ గ్రూప్ నుంచి విజయ్ నాయర్ ద్వారా దారి మళ్లించిన రూ. 100 కోట్ల ముడుపులపై ప్రత్యేకంగా మెన్షన్ చేసింది. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా సమకూర్చారో అన్న అంశాలపై అభియోగ పత్రాల్లో ఈడి పేర్కొంది.
నాయర్కు డబ్బు అవసరమని బుచ్చిబాబు మెసేజ్
విజయ్నాయర్కు అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లై కిక్ బ్యాక్ (ముడుపులు) అందించినట్లు ఈ ఏడాది ఫిబ్రవరి 23, 28 తేదిల్లో బుచ్చిబాబు వాగ్మూలంలో పేర్కొన్నారని ఈడీ తెలిపింది. ఐటీసీ కోహినూర్ లో జరిగిన సమావేశంలో బుచ్చిబాబుతో పాటు అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, దినేశ్ అరోరా హాజరై సౌత్ గ్రూప్ నుంచి విజయ్ నాయర్ కు అందించాల్సిన కిక్ బ్యాక్స్/నిధులపై చర్చించినట్లు వివరించింది. విజయ్ నాయర్ కు డబ్బు అవసరం ఉందంటూ సౌత్ గ్రూప్ లోని భాగస్వాములకు బుచ్చిబాబు పెట్టిన వాట్సాప్ మెసేజ్ లను ఈడీ వెల్లడించింది. బుచ్చిబాబుకు సంబంధించిన రెండు ఫోన్ నెంబర్ల(9849039635, 8696199999)ను చార్జ్షీట్లలో పొందుపరిచింది. మొత్తం 6 పాయింట్లపై ఐటీసీ కోహినూర్లో చర్చ జరిగిందని, మొదటి ఐదు పాయింట్లు బిజినెస్ రిలేటెడ్, ఆరో పాయింట్ ‘వీ నీడ్ మనీ’(విజయ్ నాయర్ కు అవసరమైన మనీ) అనే అంశమని ఈడీ వివరించింది. లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మాగుంట రాఘవ రెడ్డి కొడుకు రాఘవరెడ్డి పాత్రను కూడా వెల్లడించింది.
చదరపు అడుగు రూ. 1,260
భూముల వ్యవహారంలో కవిత భర్త అనిల్తో పాటు అరుణ్ పిళ్లై, కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, క్రియేటివ్ డెవలపర్స్ భాగస్వామి రవిశంకర్ చెట్టికి గల సంబంధాన్ని ఈడీ వెల్లడించింది. క్రియేటివ్ డెవలపర్స్ భాగస్వామి రవి శంకర్ చెట్టి నుంచి అరుణ్ పిళ్లై రూ.5 కోట్లకు స్థలాన్ని కొనుగోలు చేశాడని తెలిపింది. అదేవిధంగా కవిత భర్త అనిల్ భాగస్వామిగా ఉన్నఎన్గ్రోత్ క్యాపిటల్ సంస్థ పేరిట బుచ్చిబాబు కూడా ల్యాండ్ను కొనుగోలు చేశాడని పేర్కొంది. మార్కెట్ విలువ చదరపు అడుగుకు రూ. 1,760 ఉంటే.. కవితకు ఉన్న రాజకీయ పలుబడిని ఉపయోగించి కేవలం రూ. 1,260 చెల్లించి కొన్నారని ఈడీ తెలిపింది.