లాక్డౌన్ ఉన్నా మే లో జోరుగా అమ్మకాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లాక్డౌన్ ఉన్నా లిక్కర్ సేల్స్ తగ్గలేదు. ఇటీవలిదాకా వైన్స్కు పొద్దున పూట 4 గంటల టైం మాత్రమే ఉన్నా లిక్కర్ సేల్స్ బాగానే జరిగాయి. మే నెలలో మొత్తం రూ. 2,116 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి తరలింది. ఇందులో 26 లక్షల కేసుల ఐఎంఎల్, 20 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో రూ. 448 కోట్లు, నల్గొండలో రూ. 241 కోట్లు, హైదరాబాద్లో రూ. 191 కోట్లు, వరంగల్ అర్బన్లో రూ.180 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది మే నెలలో లాక్డౌన్ లేదు. అప్పుడు రూ.2,270 కోట్ల లిక్కర్ సేల్ అయ్యింది. ఈసారి లాక్డౌన్ ఉన్నా.. మద్యం అమ్మకాలు జోరుగానే సాగాయి. సోమవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా రూ. 154 కోట్ల విలువైన లిక్కర్ డిపోల నుంచి తరలింది. మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు నెలల్లో రూ.4,388 కోట్ల లిక్కర్ అమ్ముడైంది.