లిక్కర్​ సేల్స్​ 6 నెలల్లో 14 వేల కోట్లు

లిక్కర్​ సేల్స్​ 6 నెలల్లో 14 వేల కోట్లు
  • రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం జోరుగా అమ్మకాలు
  • కిందటేడాదితో పోలిస్తే 2,500 కోట్ల ఎక్కువ సేల్స్​
  • 3,247 కోట్ల అమ్మకాలతో రంగారెడ్డి జిల్లా టాప్
  • చాన్నాళ్ల తర్వాత బీర్లకు పెరుగుతున్న గిరాకీ
  • ఈ సెప్టెంబర్​లో రూ. 2,267 కోట్ల అమ్మకాలు​

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. లిక్కర్ ​సేల్స్​తో సర్కారుకు మస్తు ఆమ్దానీ వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి 6 నెలల్లోనే  రూ. 14,320 కోట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు రూ. 2,520 కోట్ల ఆదాయం ఎక్కువ వచ్చింది. చాలా కాలం తర్వాత బీర్ల అమ్మకాలు కూడా పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే శాఖల్లో ఆబ్కారీ శాఖ ముఖ్యమైంది. రాష్ట్రంలో 2,216 మద్యం షాపులతో పాటు బార్లు, క్లబ్‌‌లు, పబ్‌‌లు ఉన్నాయి. వీటికి ఆయా జిల్లాల్లో ఉన్న మద్యం డిపోల నుంచి సరుకు సరఫరా అవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌‌ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో రూ. 14,320 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. లిక్కర్‌‌ 1.75 కోట్ల కేసులు, బీరు 1.53 కోట్ల కేసులు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే టైమ్​లో 11,800 కోట్లు విలువైన ఇన్‌‌కం వచ్చింది. అంటే గతేడాది కంటే ఈసారి రూ. 2, 520 కోట్లు ఎక్కువగా ఆదాయం వచ్చింది. గతేడాది ఏప్రిల్‌‌లో మద్యం దుకాణాలు బందయ్యాయి. తర్వాత మే నెలలో భారీగా లిక్కర్‌‌ సేల్ జరిగిన విషయం తెలిసిందే. ఆ మే నెలలోనే మద్యంపై కరోనా సెస్‌‌ పేరుతో 20 శాతం వరకు రేట్లు పెంచారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా సెస్‌‌ పెంచి తర్వాత తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొనసాగిస్తోంది. 
రంగారెడ్డిలో రూ. 3,247 కోట్ల లిక్కర్‌‌ సేల్స్‌‌
రాష్ట్రంలోని కొత్త జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్​లో అత్యధికంగా లిక్కర్‌‌ అమ్ముడవుతోంది. రంగారెడ్డి జిల్లాలో రూ. 3,247 కోట్ల లిక్కర్​ అమ్ముడవగా..  రూ. 1,599 కోట్లతో నల్గొండ జిల్లా రెండో ప్లేస్‌‌లో ఉంది. హైదరాబాద్‌‌లో రూ. 1, 483 కోట్లు, వరంగల్‌‌లో రూ. 1,185 కోట్లు, మెదక్‌‌లో రూ. 1,113 కోట్లు, మహబూబ్‌‌నగర్‌‌లో రూ. 1,110 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. 
మళ్లీ బీర్లు బానే తాగుతున్రు
గతంలో తెలంగాణలో బీర్లు బాగా అమ్ముడయ్యేవి. రాష్ట్ర ప్రభుత్వం ఈ జులైలో రూ. 90 ఉన్న బీరును రూ. 150 చేయడంతో వినియోగదారులు కొందరు లిక్కర్‌‌ వైపు మళ్లారు. దీంతో బీరు అమ్మకాలు తగ్గుతూ వచ్చాయి. దీంతో ప్రభుత్వం బీరుపై రూ. 10 తగ్గించింది. ఇప్పుడు బీర్ల అమ్మకాలు మళ్లీ పెరుగుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌‌లో 21లక్షల కేసుల బీర్లు సేల్‌‌ కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌‌లో 24 లక్షల కేసుల బీర్ల అమ్ముడయ్యాయి. ఈ సెప్టెంబర్‌‌ నెలలో రూ. 2,267 కోట్ల మద్యం అమ్ముడైంది. పండుగలు, ఎన్నికల వల్ల అక్టోబర్‌‌ నెలలో ప్రభుత్వానికి మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది.