- లిక్కర్ ధరలు పెంచిన ప్రభుత్వం
- ఓల్డ్ స్టాక్ తో దోచుకుంటున్న వైన్స్
- ఎంఆర్ పీపై రూ.20 నుంచి 100 అదనంగా వసూలు
రంగారెడ్డి జిల్లా, వెలుగు : మందుబాబులు దోపిడీకి గురవుతున్నారు. ప్రభుత్వం లిక్కర్ ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందో లేదో పాత లిక్కర్ను కొత్త ధరలకు అమ్మడం స్టార్ట్ చేశారు షాపుల యజమానులు. పాత లిక్కర్ను పాత ధరలకు, కొత్త లిక్కర్ను కొత్త ధరలకు విక్రయించాలని రూల్స్ చెబుతున్నాయి. మద్యం బాటిళ్లపై ఎంఆర్పీకి మించి ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు. కానీ ప్రభుత్వ ప్రకటనను సాకుగా చూపుతూ రూ.20 నుంచి రూ.80 వరకు తీసుకుంటున్నారు.
హైదరాబాద్లోనే ఎక్కువ..
రాష్ట్రంలో మొత్తం 2216 షాపులు ఉండగా హైదరాబాద్ జిల్లాలో 173, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 422 దుకాణాలున్నాయి. మొత్తం 595 షాపుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతోంది. లిక్కర్ ధరలు పెంచిన తర్వాత సోమవారం డిపోల నుంచి కొత్త స్టాకు ఇవ్వలేదు. మంగళవారం కూడా స్టాక్ రాకపోవడంతో గ్రేటర్లోని పలు షాపుల్లో దోపిడీ పర్వం కొనసాగింది. ప్రశ్నించే వాళ్లు లేకపోవడంతో అక్రమంగా కోట్ల రూపాయలు ఆర్జించారు.
కావాలిస్తే తీసుకో..లేదంటే వెళ్లిపో…
‘అదేంది. బాటిల్పై పాత ధరే ఉంది కదా. ఎక్కువ పైసలు తీస్కుంటున్నరేంది?’ అని ఎవరైనా షాపుల యజమానులను ప్రశ్నిస్తే ‘మందు కావాలంటే అడిగినంతా ఇచ్చి తీసుకుపో..లేదంటే వెళ్లిపో..ఎక్కువ మాట్లాడొద్దు’ అంటూ సమాధానం ఇవ్వడం కనిపించింది. దాదాపు ప్రతిషాపులో ఇలా జరుగుతున్నా ఎక్కడా ఎక్సైజ్శాఖ అధికారులు తనిఖీలు కనిపించలేదు.
దొరికితే షాపు సీజ్ చేస్తాం
15 రోజులు లైసెన్స్ సస్పెండ్ చేసి రూ.2 లక్షలు ఫైన్ వేస్తాం. మా దృష్టికి రాలేదు. వస్తే చర్యలు తీసుకుంటాం. పాత లిక్కర్ను కొత్త ధరలకు అమ్మితే ఊరుకోం. రూల్స్ బ్రేక్ చేసే షాపులపై నిఘా పెట్టాం. కొత్త స్టాక్ వచ్చాకే దానిపైన ఉన్న ఎంఆర్పీకి మాత్రమే అమ్మాలి. లేదంటే కఠిన చర్యలు తీసకుం టాం. అవసరమైతే షాపులను సీజ్ చేస్తాం.
‑ వివేకానంద,
ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, హైదరాబాద్