
న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకులు (పీఎస్బీలు) తమ సబ్సిడరీలను మార్కెట్లో లిస్టింగ్ చేయాలని, తమ వాటాలను కొంత తగ్గించుకోవాలని ఫైనాన్స్ మినిస్ట్రీ కోరింది. ఇలా చేయడం ద్వారా సబ్సిడరీల కార్యకలాపాలను మరింత విస్తరించడానికి, రెవెన్యూ పెంచుకోవడానికి వీలుంటుందని తెలిపింది. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ బ్యాంకులకు చెందిన 15 సబ్సిడరీలు లేదా జాయింట్ వెంచర్లు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) లేదా డిజిన్వెస్ట్మెంట్ కోసం సిద్ధంగా ఉన్నాయి. ఉదాహరణకు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ ):
ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్:ఈ కంపెనీని ఫిబ్రవరి 24, 2009న స్థాపించారు. 2024–-25లో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్కి రూ.509 కోట్ల లాభం వచ్చింది. ఈ కంపెనీలో ఎస్బీఐ వాటా 2025 మార్చి నాటికి 68.99 శాతంగా ఉంది. ఐపీఓకి వచ్చే ప్లాన్లో ఉంది.
ఎస్బీఐ పేమెంట్ సర్వీసెస్:ఈ కంపెనీలో ఎస్బీఐకి 74 శాతం వాటా ఉండగా, మిగిలిన వాటా హిటాచి పేమెంట్ సర్వీసెస్ కంట్రోల్లో ఉంది. మర్చంట్ కస్టమర్లు ఈ సంస్థకు ఎక్కువగా ఉన్నారు. మార్చి 31, 2024 నాటికి 33.10 లక్షల మర్చంట్ పేమెంట్ యాక్సెప్టెన్స్ (అంగీకరించే) టచ్ పాయింట్లు, అందులో 13.67 లక్షల పీఓఎస్ మెషీన్లు ఉన్నాయి. ఐపీఓ ద్వారా ఫండ్స్ సేకరించే ఆలోచనలో ఉంది.
కెనరా బ్యాంక్:కెనరా రోబెకో ఏఎంసీ: దీనిని 1993లో (ప్రారంభంలో కెనరా బ్యాంక్ మ్యూచువల్ ఫండ్) ఏర్పాటు చేశారు. 2007లో రోబెకో గ్రూప్తో కలిసి కెనరా రోబెకో మ్యూచువల్ ఫండ్గా మారింది. ఈ జాయింట్ వెంచర్లో కెనరా బ్యాంక్కు 51శాతం వాటా, జపాన్కు చెందిన ఓరిక్స్ కార్పొరేషన్కు 49 శాతం వాటా ఉంది. 13శాతం వాటా అమ్మేందుకు ఆర్బీఐ నుంచి అనుమతి పొందింది.
కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్: ఈ కంపెనీని కెనరా బ్యాంక్ (51శాతం), హెచ్ఎస్బీసీ ఇన్సూరెన్స్ (ఆసియా పసిఫిక్) హోల్డింగ్స్ (26శాతం), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (23శాతం) కలిసి ఏర్పాటు చేశాయి. ఐపీఓ ద్వారా 14.5శాతం వాటాను అమ్మేందుకు ఆర్బీఐ అనుమతి
పొందింది.