కాశ్మీర్ లో లిథియం..ఎలక్రిక్ కార్లకు కొదవుండదు..!

కాశ్మీర్ లో లిథియం..ఎలక్రిక్ కార్లకు కొదవుండదు..!

దేశంలో తొలిసారి లిథియం నిల్వలు వెలుగుచూశాయి. జమ్ము కాశ్మీర్ లో 59లక్షల టన్నుల లిథియం ఉన్నట్లు కేంద్ర గనుల శాఖ ప్రకటించింది.  బ్యాటరీలు, విద్యుత్ పరికరాల తయారీలో కీలకమైన ఈ లోహాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జమ్ము కాశ్మీర్ లోని రియాసి జిల్లాలోని సలాల్ హైమాన ప్రాంతంలో కనుగొన్నట్లు గనుల శాఖ ట్వీట్ చేసింది. గనుల శాఖ నిర్వహించిన సర్వేలో జమ్మూకాశ్మీర్, ఏపీ, చత్తీస్ ఘడ్, గుజరాత్, జార్ఖండ్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణల్లో 51 చోట్ల ఖనిజ నిల్వలను గుర్తించారు. వాటిలో 5 బంగారం గనులు కాగా.. మిగిలిన చోట పొటాష్, మాలిబ్డినం తదితర లోహాలను గుర్తించారు. 2018-19 మధ్య కాలంలో నిర్వహించిన సర్వేలో వీటిని గుర్తించారు.

ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో ఉపయోగించే లిథియంను భారత్ ముఖ్యంగా ఆస్ట్రేలియా, అర్జెంటీనా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. తాజాగా లిథియం నిల్వలు కనుగొనడంతో ఈవీ వాహనాల తయారీకి మరింత బలం చేకూరనుంది. కొత్తగా బయటపడిన నిల్వల కారణంగా దేశంలో లిథియం దిగుమతులు తగ్గనున్నాయి. మన దగ్గరే ఆ లోహం లభిస్తుండటంతో ఎలక్ట్రానిక్ వెహికిల్స్, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లలో ఉపయోగించే బ్యాటరీల తయారీ ఖర్చు తగ్గనుంది. ఫలితంగా ఈవీలు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ ల ధరలు తగ్గే అవకాశముంది.