తగ్గుతున్న పశు సంపద .. కామారెడ్డి జిల్లాలో ఐదేండ్లలో ఆవులు, ఎడ్లు 40,627 తగ్గుదల

తగ్గుతున్న పశు సంపద .. కామారెడ్డి జిల్లాలో ఐదేండ్లలో ఆవులు, ఎడ్లు  40,627 తగ్గుదల
  • నిర్వహణ భారం, పచ్చిక బయళ్లు లేకపోవటంతో పాడి నిర్వహణపై రైతుల ఆనాసక్తి       

కామారెడ్డి​, వెలుగు : కామారెడ్డి జిల్లాలో గత ఐదేండ్లలో పశు సంతతి గణనీయంగా తగ్గింది. కొద్ది రోజుల క్రితం పశు సంవర్థక శాఖ పశు గణన చేపట్టింది. తెల్లజాతి ఆవులు, ఎద్దులు, నల్లజాతి బర్రెలు అధికంగా తగ్గాయి.  పౌల్ర్టీ కోళ్లు మాత్రం పెరిగాయి. గొర్రెలు, మేకలు కూడా తగ్గినట్లు అధికారులు పేర్కొన్నారు.  వ్యవసాయానికి అనుబంధంగా ఉండే పాడి పరిశ్రమ ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొంటుంది.  

వ్యవసాయ సాగులో వస్తున్న  యంత్రాల వినియోగంతో పాటు,  నిర్వహణ భారం, పచ్చిక బయళ్లు లేకపోవటం,  ప్రస్తుత జనరేషన్ పశువుల పెంపకంపై  ఆసక్తి చూపకపోవటంతో పశు సంపద తగ్గుతోంది.  ఐదేండ్లకోసారి పశు సంవర్థక శాఖ  పశు సంతతి వివరాలను సేకరిస్తుంది.  ఈసారి కొద్ది నెలల క్రితం ఆన్​లైన్​ యాప్​ ద్వారా పశు గణన చేశారు. అధికారి క్షేత్ర స్థాయిలో  పశువుల దగ్గరకు వెళ్లి  యాప్​ను అప్​లోడ్ చేస్తేనే వివరాలు ఆన్​లైన్​లో నమోదయ్యాయి.  ఆవులు, ఎద్దులు 40,627 తగ్గగా, బర్రెలు 19,624 తగ్గాయి.  మాంసం వినియోగం పెరిగినప్పటికీ గొర్రెలు, మేకలు తగ్గటం గమన్హారం.  పౌల్ర్టీ కోళ్ల సంఖ్య మాత్రం పెరిగింది.  

తగ్గటానికి కారణాలు..

పశు సంతతి తగ్గటానికి ప్రధానంగా వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు తోడు, వీటి పెంపకం భారంగా భావిస్తుండడమే కారణమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.  పశువులను మేపటానికి  గతంలో ఊరి శివారులో పచ్చిక బయళ్లు ఉండేవి. ఇప్పుడు రియల్ ఎస్టేట్​ ప్రభావంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. భూములను బడా వ్యాపారులు, ఇతర వ్యక్తులు కొనుగోలు చేసి వాటికి పెన్సింగ్ చేశారు.   గతంలో కొంత భూమిని రైతులు పశువుల మేత కోసం వదిలేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.  వ్యవసాయ  పనుల కోసం ఎద్దులు ఉండేవి.  ఇప్పుడు దున్నటం, విత్తనం వేయటం,  పంట నూర్పడి వంటి వాటికి యంత్రాలు, ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. పొద్దంతా పశువులను చూడాలని కొందరు రైతులు అమ్మేసుకున్నారు.    

పశువుల వివరాలు  

పశువు రకం    2024లో    ఐదేండ్ల క్రితం
ఆవులు, ఎద్దులు    68,373    1,09,000
బర్రెలు    97,576    1,17,150
గొర్రెలు    4,08,903    5,00,040
మేకలు    1,50,046    1,59,100
పౌల్రీ , కోళ్లు    14,00,000    12,00,000 

పశువుల పెంపకం చేపట్టాలి

మారిన పరిస్థితుల కారణంగా పశువులను పెంపకాన్ని చాలా మంది రైతులు  తగ్గించారు. కానీ ఇది సరికాదు.  వ్యవసాయ అనుబంధంగా పశువుల పెంపకం చేపట్టాలి. పశువుల ఎరువు పంట దిగుబడికి బాగా పని చేస్తుంది. పాల ఉత్పత్తితో ఆదాయం వస్తుంది.
సంజయ్​కుమార్​, జిల్లా వెటర్నరీ అధికారి