ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు రూ.43,937 కోట్లు లోన్లు
ఇందులో సగం పాత అప్పుల కిస్తీలు, మిత్తీలకే చెల్లింపు
ఇట్లయితే రాష్ట్ర ఇన్కం మొత్తం లోన్లు కట్టడానికే సరిపోదని ఎక్స్పర్టుల హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు గత రెండు నెలల్లోనే ఏకంగా రూ.16,717 కోట్లు అప్పులు చేసింది. ఎన్నడూ లేనట్టుగా డిసెంబర్ ఒక్క నెలలోనే రూ.9,897 కోట్లు తీసుకోగా, జనవరిలో రూ.6,820 కోట్లు లోన్లు తీసుకుంది. వీటితో కలిపి ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్లో రాష్ట్రం తీసుకున్న అప్పులు రూ.43,937 కోట్లకు చేరాయి. ఇది బడ్జెట్లో అనుకున్న దానికంటే 32 శాతం ఎక్కువ కావడం గమనార్హం. కంప్ట్రోలర్అండ్ అడిట్ జనరల్(కాగ్) లేటెస్ట్రిపోర్ట్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. గత రెండు నెలల్లో రాష్ట్రానికి ట్యాక్స్ల ద్వారా వచ్చిన ఇన్కం కంటే.. తీసుకున్న అప్పులే ఎక్కువగా ఉన్నట్టు కాగ్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. డిసెంబర్, జనవరి 2 నెలలు కలిపి రాష్ట్రానికి సమకూరిన ట్యాక్స్ ఇన్కం రూ.15,519 కోట్లే. ఇంకా ఫైనాన్షియల్ ఇయర్లో మిగిలిన ఫిబ్రవరి, మార్చి నెలలనూ కలిపితే.. రాష్ట్రం ఈ ఒక్క ఏడాది చేసే అప్పులు రూ.50 వేల కోట్లు దాటొచ్చని ఎక్స్పర్టులు చెప్తున్నారు. కాగ్రిపోర్టు ప్రకారం.. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్లో రాష్ట్రానికి రూ. లక్షా 43 వేల కోట్ల రాబడి అంచనా వేయగా.. జనవరి నాటికి రూ.74 వేల 990 కోట్లే వచ్చాయి. ఇందులో జీఎస్టీ వసూళ్లు రూ.20 వేల కోట్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లతో రూ.3,358 కోట్లు, సేల్స్ట్యాక్స్రూ.16,416 కోట్లు, ఎక్సైజ్ తో రూ.11,443 కోట్లు సమకూరాయి.
అప్పులు కట్టేందుకే మళ్లీ అప్పులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సర్కారు చేసిన అప్పుల్లో సగం పాత అప్పుల కిస్తీలు, మిత్తిలకే కట్టారు. సర్కారు ఈ ఏడాది ఇప్పటివరకు రూ.20,855 కోట్లను అప్పుల కిస్తీలు, వడ్డీకి చెల్లించింది. ఇందులో మిత్తిలకే రూ.12,735 కోట్లు కట్టగా కిస్తీలకు రూ.8,120 కోట్లు చెల్లించారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాష్ట్రానికి వచ్చే ఇన్కం మొత్తం అప్పుల కిస్తీలు, వడ్డీలకే సరిపోదని ఎక్స్పర్ట్స్హెచ్చరిస్తున్నరు.