
స్థానిక సంస్థల ఎన్నికలను వీలైనంత తొందరగా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జూన్ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. సోమవారం (జూన్ 16) జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించాక ఎన్నికల తేదీ పై స్పష్టత ఇస్తామని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా - తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అవి పూర్తయిన వెంటనే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలని, - నాయకులు ఎవరైనా సరే ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
- ఎన్నికలు రావడానికి 15రోజుల గడువు మాత్రమే ఉంది కాబట్టి.. గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం అవ్వండని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. - రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజా ప్రభుత్వం- ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజల దరిచేర్చడం జరిగిందని అన్నారు. - రాబోయే వారం రోజుల్లోనే అర్హులైన రైతు సోదరులందరికీ కుంట మొదలుకుని ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వనున్నట్లు చెప్పారు. సన్నాలకు బోనస్ వారి వారి బ్యాంకు ఖాతాలలో జమా చేయడం జరుగుతుందని తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఆవశ్యకతను ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదేని చెప్పారు. గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించుకోవడమే కాదు... వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా నాయకులు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి పొంగులేటి.
కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు మంత్రి పొంగులేటి. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో ఒక్కో మండలం వారీగా సమావేశం నిర్వహించిన మంత్రి స్థానిక సంస్థల ఎన్నికలకు జూన్ నెలాఖరున నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పారు.