
మార్చి నెలాఖరులోగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. స్థానిక ఎన్నికలపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన…ఏపీ హైకోర్టు తీర్పుపై మాట్లాడారు. ఎన్నికల్లో డబ్బు, మద్యంలను నియంత్రించాలనే ఆర్డినెన్సును తీసుకొచ్చామని తెలిపారు. డబ్బు, మద్యం పంపినట్లు రుజువైతే ఎన్నికల తర్వాత కూడా అనర్హత వేటు వేయడంతో పాటు… మూడేళ్ల జైలు శిక్ష విధించాలని ఆదేశించారు.
అంతేకాదు గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సేవ చేసే వ్యక్తులే ఎన్నిక కావాలన్నారు జగన్. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దేశానికే ఆదర్శం కావాలని.. అందుకే పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేశామని అధికారులకు చెప్పారు.
సాధారణ ఎన్నికల్లో అక్రమాలు, ఉల్లంఘనల నిరోధానికి ఉపయోగించిన విధంగానే ఓ యాప్ను అందుబాటులోకి తీసుకురావాలని జగన్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఉండే పోలీస్ మిత్రలు, సచివాలయాల్లో ఉండే మహిళా మిత్రలు, గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల దగ్గర ఈ యాప్ ఉండాలని సీఎం జగన్ సూచించారు.