
కరోనా వైరస్ తో భయాందోళనకు గురవుతున్న ప్రజలు తమ గ్రామాల సరిహద్దుల్లో పెద్ద పెద్ద పైపులతో కంచలు వేసుకుంటున్నారు. కరోనా తగ్గే దాకా తమ ఊరికి రావద్దంటూ హెచ్చరిస్తున్నారు. అయితే ఓ గ్రామ సరిహద్దుల్లో వేసిన పైపులు ఓ వ్యక్తి ప్రాణం తీశాయి.
భీమదేవరపల్లి మండలం, ధర్మారంలో విషాదం చోటు చేసుకుంది. ధర్మారం గ్రామానికి చెందిన రమేశ్ లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు.ఈ నేపథ్యంలో తమ ప్రాంతంలో కరెంట్ లేదంటూ జిల్గుకు చెందిన స్థానికులు లైన్ మెన్ రమేశ్ కు ఫోన్ చేశారు. దీంతో విధుల నిమిత్తం జిల్గుకు వెళ్లి పని పూర్తి చేసుకొని సాయంత్రం సమయంలో తన స్వగ్రామ మైన ధర్మారానికి ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. ధర్మారానికి వచ్చే మార్గంలో ఇతర గ్రామాల ప్రజలు తమ సరిహద్దుల్లో పైప్ లను అడ్డంగా ఉంచారు. ప్రమాదవశాత్తు ఆ పైప్ లను ఢీ కొట్టడంతో బాధితుడికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు రమేశ్ ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు.