కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న లాక్డౌన్ను మరోసారి పొడిగించింది. కొన్ని సడలింపులతో జులై 19వరకు అమలు చేయనున్నట్టు ప్రకటించింది. షాపులు మాత్రం రాత్రి 9గంటల వరకు తెరిచి ఉంచేందుకు అవకాశం కల్పించింది.
రాష్ట్రంలో రెస్టారెంట్లు, టీ స్టాల్స్, బేకరీలు, రోడ్డు పక్కన ఉన్న షాపులకు మరో గంటపాటు సడలింపు ఇచ్చారు. 50శాతం కస్టమర్లతో రాత్రి 9గంటల వరకు షాపులు తెరిచి ఉంచుకొనేందుకు అవకాశం కల్పించారు. అయితే..కరోనా నిబంధనలు కఠినంగా అమలుచేయడంతో పాటు ఆయా దుకాణాల బయట శానిటైజర్లు ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏసీ వినియోగించే సంస్థలు..ఆఫీసుల్లో మాత్రం తగిన వెంటిలేషన్ ఉండేలా జాగ్రత్త వహించాలని సూచించింది.
పెళ్లిళ్లకు 50మంది, అంత్యక్రియలకు 20మంది మించరాదని ప్రభుత్వం నిబంధనలు విధించింది. స్కూళ్లు,కాలేజీలు, బార్లు, సినిమా థియేటర్లు,జూ, స్విమ్మింగ్ పూల్స్ మూసే ఉంటాయంది. సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలకు అనుమతించలేదు.