రాష్ట్రంలో మళ్లీ మొదలైన లాక్‌డౌన్‌లు

రాష్ట్రంలో మళ్లీ మొదలైన లాక్‌డౌన్‌లు

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రమంగా వ్యాపారాలు, మాల్స్, కాంప్లెక్స్‌లు తెరుచుకుంటున్నాయి. అయితే మళ్లీ థర్డ్ వేవ్ వ్యాపిస్తోందన్న వార్తలతో మరోసారి  రాష్ట్రంలో లాక్‌డౌన్‌లు మొదలయ్యాయి. తాజాగా జగిత్యాల జిల్లాలో లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది. 
వెల్గటూర్ మండలం ఎండపల్లిలో గత రెండు రోజుల క్రితం కరోనాతో ఒకరు మృతి చెందడంతో పాటు.. కరోనా కేసుల సంఖ్య 12కు పెరిగింది. దాంతో గ్రామంలో జూలై 19వ తేదీ నుంచి ఆగస్ట్ 1 వరకు పది రోజుల పాటు లాక్డౌన్ విధిస్తూ గ్రామపంచాయతీ తీర్మానం చేసింది. ఉదయం ఏడు గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని.. ఆ తర్వాత మూసేయాలంటూ తీర్మానంలో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణ యజమానులకు 5 వేల రూపాయల జరిమాన విధిస్తామని తెలిపారు. అలాగే గుంపులుగా తిరిగినా, మాస్క్ ధరించకపోయినా వెయ్యి రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించారు. ఏఎన్ఎంలకు కరోనా రోగుల సమాచారం అందించిన తర్వాతే.. ఆర్ఎంపీలు వైద్యం చేయాలని తీర్మానించారు. సామాజిక దూరం పాటించాలని.. గుంపులుగా తిరగొద్దని.. మాస్క్ ధరించాలంటూ అవగాహన కల్పించేలా గ్రామంలో వాల్ పోస్టర్స్ అతికించారు.